హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): భద్రాచలం క్షేత్రాన్ని వరద ముప్పు నుంచి శాశ్వతంగా తప్పించడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టడం కోసం పట్టణం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని, ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. వరదలు వచ్చినప్పుడల్లా భద్రాచలం సీతారామాలయంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని జనావాసాలు ముంపునకు గురవటం బాధాకరమన్నారు.
భద్రాచలంలో గోదావరికి ఇరువైపులా కరకట్టలను పటిష్ఠం చేసేందుకు, ముంపు బాధితులను ఆదుకొనేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ఆర్ద్రతతో, ఉదారంగా రూ.1000 కోట్లు ప్రకటించినందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. భద్రాద్రి ఆలయాన్ని కాపాడుకోవడానికి పేదలను కాపాడుకోవడానికి కరకట్ట సహా ఇతర నిర్మాణాలను ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల గ్రామాల పరిధిలో చేపట్టాల్సి వస్తుందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈ ఐదు గ్రామాలతోపాటు ఏడు మండలాలను ఏపీలో కలిపిన విషయాన్ని గుర్తుచేశారు.
భద్రాచలం వరద బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. భద్రాచల రాములవారి ఆలయంతోపాటు.. అక్కడి వేల మంది ప్రజలకు శాశ్వత ఉపశమన చర్యలు చేపట్టేందుకు కలిసి పనిచేద్దామని కోరారు. భద్రాచలం ముంపు నేపథ్యాన్ని ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు అర్థం చేసుకోలేదని, తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొన్నారని చెప్పారు. మంగళవారం ఉదయం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడారు.
ఆ మీడియా సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు విపరీత ధోరణితో స్పందించడంతో సాయంత్రం ఒక ప్రకటన కూడా విడుదలచేశారు. పక్క రాష్ట్రంలోని గ్రామాల్లో తెలంగాణ నిర్మాణాలు చేపట్టడం కష్టం కాబట్టి కనీసం ఆ ఐదు గ్రామాలనైనా తెలంగాణకు కేటాయిస్తే వరద నివారణ కోసం నిర్మాణాలు చేపడతామని, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి, కేంద్రం ఒప్పుకోవాలని తాను చేసిన సూచనలో తప్పేమున్నదని ప్రశ్నించారు.
ఏపీ మంత్రులు తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడటం విచారకరమన్నారు. ప్రజలు, దేవుడు మునగకుండా తాను ఐదు గ్రామాల గురించి మాట్లాడుతుంటే.. ‘మాకు హైదరాబాద్ ఇస్తరా?’ అంటూ వ్యాఖ్యలు చేయడం అర్థరహితమని విమర్శించారు. ‘దేవుడు ఎవరికైనా దేవుడే. తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు ఇలవేల్పే. తమ ఇష్ట దైవం నీళ్లల్లో మునిగిపోతుంటే.. ఆంధ్ర ప్రజలకు బాధ కలుగదా? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు పనిచేయాల్సిన అవసరం లేదా?’ అని ప్రశ్నించారు.
ఏపీ మంత్రులు చొరవ తీసుకోవాలి
వరదల శాశ్వత పరిషారానికి సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు ప్రకటించారని పువ్వాడ గుర్తు చేశారు. ఈ సమస్యలపై కేసీఆర్తో చర్చలకు జగన్ను ఒప్పించాలని ఏపీ మంత్రులు బొత్స, అంబటిని కోరారు. రాములవారి గుడి మునగకుండా చూడటమే తమ అభిమతమన్నారు. తెలంగాణ చేపట్టనున్న కరకట్టల నిర్మాణానికి, పేదల కోసం కాలనీలు నిర్మించాలంటే.. గతంలో ఆంధ్రాలో కలుపుకొన్న 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం అత్యవసరం అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏపీ భేషజాలకు పోవద్దని హితవు పలికారు. ఇరు రాష్ర్టాల ప్రజల ప్రయోజనాల కోసం తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి విమర్శించటం సరికాదన్నారు.
ఏపీ గ్రామాలకూ తెలంగాణ అండ
భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని ఉన్న 5 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని ఎంతోకాలంగా కోరుతున్నారని, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం ఈ గ్రామాలపై చట్టం తేవాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆ 5 గ్రామాలు ఆంధ్రాలోనే ఉన్నా, అక్కడి ప్రభుత్వం వారిని పట్టించుకోకపోయినా ప్రజల కష్టాన్ని తెలిసిన ప్రభుత్వంగా తాము ఆ గ్రామాల ప్రజలను భద్రాచలం పునరావాస కేంద్రాలకు తరలించి కాపాడామని వివరించారు. సరైన సమయంలో పోలవరం నుంచి నీటి విడుదల చేసి ఉంటే భద్రాచలానికి ఇంతలా వరద ఉధృతి ఉండేది కాదన్నారు.
వరద బాధితులకు మనిషికి 20 కిలోల బియ్యం, 5 కిలోల పప్పు దినుసులు అందిస్తామని చెప్పారు. అన్నీ అనుకూలిస్తే బుధవారం నుంచి వరద బాధిత కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమచేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇంత చేస్తున్నా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వరద బాధితులను పలకరించకపోగా.. ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకోవడం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శమన్నారు. ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, కమల్రాజ్ పాల్గొన్నారు.
వరదలపై రాజకీయాలు దారుణం : కాంతారావు
వరదలపై కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విమర్శించారు. వరద నష్టం నుంచి ప్రజలను శాశ్వతంగా గట్టెకించేందుకు సీఎం కేసీఆర్ సాహాసోపేతంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వరదలు.. పునరావాస చర్యల విషయంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండాలె కానీ రాజకీయాలు చేయటం దారుణమన్నారు.
కేంద్రం ఆదివాసీలను ఆదుకోవాలి: సండ్ర
భద్రాచలం వరదలను మానవీయ ఆలోచించి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలసంఘం తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుతో లక్షల మంది ఆదివాసీ గిరిజన బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు రాజకీయ కోణంలో చూడొద్దని సూచించారు. పోలవరం బ్యాక్వాటర్ అధ్యయనం కోసం కేంద్ర జల సంఘం నిపుణుల కమిటీని వేయాలని కోరారు. కరకట్టల నిర్మాణం ఆంధ్రాలోనూ యుద్ధప్రాతిపదికన జరగాలని చెప్పారు.
తక్షణ స్పందనతోనే ప్రాణనష్టం లేదు: ఎమ్మెల్సీ తాతా
ప్రభుత్వం తక్షణం స్పందించటం వల్ల ప్రాణనష్టం జరగలేదని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నా.. వరదలు పోటెత్తుతున్నా ప్రజల కోసం సీఎం కేసీఆర్ 400 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి ప్రజల కష్టాలు తెలుసుకొని, వారికి అండగా నిలిచారన్నారు. సమస్త ప్రభుత్వ యంత్రాం గం, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ప్రజలు మనోధైర్యం కోల్పోకుండా చేశారని పేర్కొన్నారు.
పోలవరం నుంచి నీళ్లు వదలడంలో ఆలస్యం వల్లే వరద
పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంలో ఆలస్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని మంత్రి పువ్వాడ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అసలు ఎత్తుకన్నా అదనంగా పెంచిన మూడు మీటర్లు ఎత్తు తగ్గించాలని తాము మొదట్నుంచీ డిమాండ్ చేస్తున్నామని.. ఈ విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని డిమాండ్చేశారు. కరకట్టల బలోపేతం, భద్రాచలం ముంపు ప్రాంతాల్లో అన్ని వసతులతో కాలనీల నిర్మాణం చేపడతామని, ఇందుకోసం భద్రాచలం టెంపుల్ టౌన్లో వరదలు తగ్గిన తరువాత శాస్త్రీయ అధ్యయనానికి నిపుణుల కమిటీని పంపిస్తామని పేర్కొనటంతో ముంపు ప్రాంతాల ప్రజలు కేసీఆర్కు మొక్కుతున్నారని చెప్పారు.
భారీ వర్షాలు, వరదల్లోనూ రోడ్డు మార్గం ద్వారా వచ్చి ప్రజలను ఆదుకొన్న మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. వరద పరిస్థితిని ముందే ఊహించిన ముఖ్యమంత్రి తనను ఈ నెల 11నే భద్రాచలం వెళ్లాలని ఆదేశించారని తెలిపారు. 1986 స్థాయిలో గోదావరికి వరద పోటెత్తినా కేసీఆర్ మార్గదర్శనంలో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకొన్నామని వివరించారు. 25 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించి వారికే ఏ లోటు రాకుండా కంటికిరెప్పలా చూసుకొన్నామని చెప్పారు. ప్రజలకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా వైద్య ఆరోగ్యశాఖమంత్రి హరీశ్రావు వైద్య బృందాలు పంపారని పేర్కొన్నారు.