హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) /కాచిగూడ: పదోన్నతుల్లో బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులాల ప్రాతిపదికన బీసీల జనగనణ చేపట్టాలని, లాభాల్లో నడుస్తున్న రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లను ప్రైవేటీకరించవద్దని కోరారు. బుధవారం కాచిగూడలో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. పీఎస్యూల ప్రైవేటీకరణతో బీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రిజర్వేషన్లు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లను సాధించుకొనేందుకు హైదరాబాద్లోని సెంట్రల్ కోర్ట్ హోటల్లో ఈ నెల 23న బీసీ ఉద్యోగ సంఘాల ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రైల్వే, బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఈసీఐఎల్, ఎన్ఎఫ్సీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు సహా 45 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యే ఈ సమావేశానికి అఖిలపక్ష రాజకీయ నాయకులను కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. దేశంలోని 70 కోట్ల మంది బీసీలు అభివృద్ధి చెందకుండా భారత్ అగ్రదేశంగా ఎలా ఎదుగుతుందని కేంద్రాన్ని ప్రశ్నించారు.
బీసీ బంధుపై నమ్మకమున్నది..
కులాల ప్రాతిపదికన బీసీల జనగణన చేయాలంటూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతోపాటు బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెడతానని ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ గతంలో బీసీలకు కల్యాణలక్ష్మి అమలు చేశారని, గురుకుల పాఠశాలలు పెట్టారని కృష్ణయ్య గుర్తుచేస్తూ.. బీసీ బంధు పెడతానన్న హామీని కూడా సీఎం కేసీఆర్ అమలు చేస్తారనే విశ్వాసం ఉన్నదని పేర్కొన్నారు.
మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలి..
ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించేందుకు మండల్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నాచియప్పన్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కూడా సిఫారసు చేసిందని గుర్తుచేశారు. విద్యా, ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్లపై క్రిమిలేయర్ నిబంధన ఎత్తివేయాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దానకర్ణచారి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత నిరంజన్, బీసీ టీచర్ల ఉద్యోగుల సంఘం నేత కృష్ణుడు, బీసీ విద్యుత్తు ఉద్యోగుల సంఘం నేత ముత్యం వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.