హైదరాబాద్/సిటీ క్రిమినల్ కోర్ట్/నాంపల్లి, జూన్ 10 (నమస్తే తెలంగాణ)/కవాడిగూడ: హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచడంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. హైకోర్టులో పెండింగ్ కేసులు పెరిగిపోతుండటంతో జడ్జీల సంఖ్యను 42కు పెంచాలని సీఎం కేసీఆర్ 2019లో 15 ఫిబ్రవరి ప్రధాని, కేంద్ర న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకు లేఖ రాశారని గుర్తుచేశారు. 2018 డిసెంబర్ 31న హైకోర్టు విభజన జరుగగా, 2019 జనవరి 2న జడ్జీల సంఖ్యను 42కు పెంచాలని ఎంపీగా తాను లోక్సభలో ప్రస్తావించానని చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్ ఎన్వీ రమణ చొరవచూపి సమస్యను పరిష్కరించారని వినోద్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. జడ్జీల సంఖ్య పెంపుపై టీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు జీ మోహన్రావు, అడ్వకేట్స్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కవాడిగూడలోని జేఏసీ కార్యాలయంలో పులిగారి మాట్లాడుతూ.. న్యాయవాదుల చిరకాలవాంఛ నెరవేరనున్నదని అన్నారు. జడ్జీల సంఖ్యను పెంచేందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్కు బార్కౌన్సిల్ సభ్యుడు గండ్ర మోహన్రావు, ప్రభుత్వ తరఫు న్యాయవాది చలకాని వెంకట్యాదవ్, న్యాయవాద జేఏసీ కన్వీనర్ కొంతం గోవర్ధరెడ్డి, తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ అక్కల తిరుపతివర్మ, న్యాయవాద జేఏసీ సభ్యులు కిరణ్, అనిల్, ఇంద్రసేనరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.