Khammam | ఖమ్మం, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ నేత, బలహీన వర్గాల నాయకుడు వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి అవకాశం కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఆ పార్టీ ఖమ్మం జిల్లా నేతలు గురువారం నగరంలో ‘కేసీఆర్కు కృతజ్ఞత’ పేరిట సభను నిర్వహించనున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన తరువాత తొలిసారి ఖమ్మం జిల్లాకు వస్తున్న వద్దిరాజును ఘనంగా సన్మానించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఖమ్మం బైపాస్ రోడ్డులోని గాయత్రి గౌండ్స్లో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
బడుగు, బలహీన వర్గాల నేతగా గుర్తింపు పొందిన వద్దిరాజు రవిచంద్రకు మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియానాయక్, మదన్లాల్, చంద్రావతి, మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొనున్నారు.