హైదరాబాద్: తమ తండాలు, గూడెంలలో సొంతపాలన కావాలనేది ఆదివాసీల చిరకాల ఆకాంక్ష. అందుకోసం వారు సుదీర్ఘ కాలంపాటు పోరాడినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవగానే తెలంగాణ ప్రభుత్వం వారి ఆకాంక్షను నెరవేర్చింది. రాష్ట్రంలోని అన్నిగూడెంలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 3,146 మంది ఎస్టీలు కొత్తగా సర్పంచులు అయ్యారు.
ఆర్థిక మంత్రి హరీష్రావు ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేస్తూ ఈ వివరాలను వెల్లడించారు. గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణం కోసం ఒక్కొక్క పంచాయతీకి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.600 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇది భారత పార్లమెంటరీ పరిపాలన వ్యవస్థలో అపురూపమైన ఘట్టమని పేర్కొన్నారు.
గ్రామాలకు దూరంగా ఉన్న గిరిజన, ఆదివాసీ ప్రాంతాలను విద్యుధీకరణ చేయడం, వారి వ్యవసాయ భూములకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించడం కోసం ప్రభుత్వం రూ. 215 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. అదేవిధంగా ఆదివాసీ యోధుడు కొమురం భీమ్ జయంతిని, బంజారాల ఆరాధ్య ధైవమైన సేవాలాల్ మహరాజ్ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నది. తాజా బడ్జెట్లో ఎస్టీల సంక్షేమం కోసం రూ.12,565 కోట్లు ప్రతిపాదించింది.