2వేల మంది వృత్తి నిపుణులకు ఉపాధి
మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం
సిరిసిల్లలో నేతన్నల నైపుణ్యం, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించాం. స్థానికులకు ఉద్యోగాలు
కల్పించడమే లక్ష్యంగా మా కంపెనీని ఏర్పాటు చేస్తాం. – టెక్స్పోర్ట్ ఎండీ గోయెంకా
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్ పార్కులో బెంగళూరుకు చెందిన ప్రముఖ జౌళి ఉత్పత్తుల సంస్థ టెక్స్పోర్ట్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో టెక్స్పోర్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకొన్నది. ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, టెక్స్పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర డీ గోయెంకా ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సిరిసిల్లలోని పెద్దూరు గ్రామ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 63 ఎకరాల్లో రూ.175 కోట్లతో అప్పారెల్ పార్కును అభివృద్ధి చేస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు కల్పిస్తున్నారు. అప్పారెల్స్ ఉత్పత్తులతోపాటు ఎగుమతులకు అనుగుణంగా ‘బిల్ట్ టు సూట్’ పద్ధతిన దేశంలోనే తొలిసారి ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్కులో 7.42 ఎకరాల విస్తీర్ణంలో టెక్స్పోర్ట్ కంపెనీ రూ.60 కోట్ల పెట్టుబడితో తన ఫ్యాక్టరీని ఏర్పాటుచేయనున్నది. దీని ద్వారా రెండువేల మందికి ఉపాధి లభించే అవకాశమున్నది.
సంపూర్ణ సహకారం అందిస్తాం: మంత్రి కేటీఆర్
సిరిసిల్లలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన టెక్స్పోర్ట్ కంపెనీని మంత్రి కేటీఆర్ అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి, వృత్తి నైపుణ్యం పెంపునకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. టెక్స్పోర్ట్ కంపెనీ సాధ్యమైనంత త్వరగా పరిశ్రమ ప్రారంభించేందుకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్లలో నేతన్నల నైపుణ్యం, ఇక్కడి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించినట్టు టెక్స్పోర్ట్ ఎండీ గోయెంకా తెలిపారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.