ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 27 : పొగమంచు కారణంగా మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఓఆర్ఆర్పై ఆదిబట్ల పరిధిలోని బొంగుళూరు వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకొన్నది. క్షతగాత్రులను దవాఖానాకు తరలించే క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ను మరో కారు ఢీకొట్టడంతో అతనూ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరకు సమీపంలోని దమ్మాయిగూడకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో ఓఆర్ఆర్ పైనుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తున్నారు. పొగమంచు కారణంగా ముందు వెళుతున్న లారీని దగ్గరికి వెళ్లేవరకూ గుర్తించలేదు. డ్రైవర్ చాకచక్యంగా కారును పక్కకు తిప్పడంతో అందులోని వారు స్వల్పంగా గాయపడ్డారు. అదే సమయంలో విజయవాడ వైపు నుంచి శంషాబాద్ వైపు వస్తున్న మరో రెండు కార్లు పక్కకు నిలిపి అంబులెన్స్కు ఫోన్చేశారు. 108 అంబులెన్స్ అక్కడకు చేరుకుని గాయపడిన వారిని అంబులెన్స్లోకి ఎక్కిస్తుండగా భద్రాద్రి కొత్తగూడం నుంచి ఎయిర్పోర్టు వైపు వెళ్తున్న మరో కారు అంబులెన్స్ డ్రైవర్ శ్రీకాంత్ను ఢీకొట్టింది. దీంతో శ్రీకాంత్ తోపాటు కారు డ్రైవర్ రఘు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కారులో ప్రయాణిస్తున్న శన్విక(8) అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె తల్లి రాధిక, సోదరి ఆద్విక, మేనమామ రవిప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, రోడ్డు పక్కన నిలిపిన కార్లను కూడా వీరి కారు ఢీకొట్టడంతో మరో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.