హైదరాబాద్, జనవరి 14 : పదో తరగతి వార్షిక పరీక్షలు (ఎస్సెస్సీ) రాసే విద్యార్థులకు ప్రభుత్వం వయో పరిమితిలో వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఎస్సెస్సీ పరీక్షలు రాయాలంటే 14 ఏండ్లు నిండి ఉండాలి. కానీ 14 ఏండ్లు లేకపోయినా పరీక్షలు రాసేందుకు కొన్ని నిబంధనలు అనుమతిస్తున్నాయి. రెండేండ్ల వరకు మినహాయింపులతో పరీక్షలు రాసుకొనే అవకాశమున్నది. 2022లో జరిగే ఎస్సెస్సీ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఇటీవలే విడుదలయ్యింది. మార్చి 3 వరకు ఫీజులను చెల్లించవచ్చు. ఈ ఏడాది ఎస్సెస్సీ పరీక్షలకు హాజరుకాబోయే విద్యార్థులు 31-8-2007కు ముందు జన్మించి ఉండాలి. అంటే 14 ఏండ్లు దాటి ఉండాలి. అయితే సర్కారు స్కూళ్లల్లో చదువుతున్నవారికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏడాదిన్నర వరకు, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ రెండేండ్ల వరకు వయోపరిమితిలో మినహాయింపు ఇవ్వవచ్చు. ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఏడాదిన్నర, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ రెండేండ్ల వరకు మినహాయింపు ఇచ్చే అధికారం ఉన్నది. వయస్సు మినహాయంపు కోసం విద్యార్థులు రూ. 300 చలానా, మెడికల్ సర్టిఫికెట్, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఎస్సెస్సీ బోర్డు అధికారులు సూచించారు.