రంగారెడ్డి, మే 25 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని కోహెడ గ్రామంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకున్నది.
బాటసింగారం పండ్ల మార్కెట్ శాశ్వత భవనాల ఏర్పాటు కోసం సర్వేనెంబర్ 167/1లో గల 179ఎకరాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. మరో వారంరోజుల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పండ్ల మార్కెట్ శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సోమవారం జేసీబీలతో భూమిని చదును చేయడానికి అధికారులు, భారీగా పోలీసులు వచ్చారు. విషయం తెలుసుకున్న కోహెడ గ్రామానికి చెందిన రైతులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు.
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
కోహెడ గ్రామంలో ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ కోసం వచ్చిన అధికారులు
తమ భూమి లాక్కునేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు
మండుటెండలో జేసీబీకి అడ్డంగా పడుకుని గ్రామస్తుల నిరసన
అధికారులు, గ్రామస్తుల… pic.twitter.com/R1zaUmpUp4
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2026
తమ తాతలు ముత్తాతల కాలంనుంచి ఈ భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నామని, ప్రాణం పోయినా భూములు ఇచ్చేదిలేదని తేల్చిచెప్పారు. జేసీబీలు ముందుకుసాగకుండా కొందరు మహిళలు అడ్డంగా పడుకున్నారు. తమను చంపి భూములు తీసుకోవాలంటూ కన్నీరు కార్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోహెడ గ్రామంలోని సర్వేనెంబర్ 548లో 133 ఎకరాలు, సర్వేనెంబర్ 507లో 44ఎకరాల ప్రభుత్వ భూమిని బాటసింగారం పండ్ల మార్కెట్కు కేటాయించిందని చెప్పారు. ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, సర్వేనెంబర్ 167/1లో గల 179ఎకరాలను మార్కెట్కమిటీకి కేటాయించిందని పేర్కొన్నారు. తమ భూములను ఇచ్చేదిలేదని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు, పోలీసులు వెనుదిరిగారు.