గీసుగొండ, డిసెంబర్ 20: రైలుకింద పడి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. ఊకల్ గ్రామానికి చెందిన మొగసాని రమేశ్ (34) మూడేండ్లుగా ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది ఆరు ఎకరాల్లో పత్తి పంట వేశాడు. ఆశించిన మేర దిగుబడి రాలేదు. వచ్చినదాంట్లో కొంత విక్రయించి, మరికొంత ఇంట్లో నిల్వ చేశాడు. ఈ క్రమంలో ఇంటి అవసరాలకు, పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులు దాదాపు రూ.10 లక్షల వరకు ఉండటంతో వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురయ్యాడు. దీంతో బుధవారం మండలంలోని ధర్మారం రైల్వేగేటు సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.