పదేండ్ల కిందట.. తెలంగాణ ప్రాంతం ఎడారిని తలపించేది. సాగు నీళ్లు లేక, కరెంట్ లేక భూములన్నీ బీడుబారేవి. రైతులు, ప్రజలు బుక్కెడు బువ్వకు, గుక్కెడు నీళ్లకు ఏడ్చే దుర్భర పరిస్థితి. పైగా, తెలంగాణ వాళ్లకు ఎవుసం చేయరాదు, పంటలు పండించరాదు అన్న సమైక్యవాదుల కించపరిచే వ్యాఖ్యలు.
సరిగ్గా పదేండ్ల తర్వాత..
ఏడారి తెలంగాణ పసిడి పంటలకు నెలవైంది. తెలంగాణ ఎవుసం.. వికసితమైంది. ఒకప్పుడు దేహీ అన్న తెలంగాణ రైతన్న ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాడు.
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): అరవై ఏండ్ల విధ్వంసాన్ని పదేండ్లలోనే రూపుమాపి, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశానికి రోల్మాడల్గా తీర్చిదిద్దింది కేసీఆర్ సర్కారు. స్వయంగా కేసీఆరే రైతు కావటంతో రైతుల సంక్షేమమే అజెండాగా అనేక సంక్షేమ పథకాలకు పురుడు పోశారు. రైతుబంధు, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టుతో దేశం లో తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టారు. ఒక్క వ్యవసాయమే కాదు.. దాని ఉప రంగాలను సైతం జోడెద్దుల్లా అభివృద్ధివైపు పరుగులు పెట్టించారు. వ్యవసాయ సంక్షేమ పథకాలతో తెలంగాణలో పంటల సాగు భారీగా పెరిగింది. ఉచిత విద్యుత్తు, కాళేశ్వరంతో పాటు ఇతర పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయటం, రైతుబంధు వంటి పథకాలు వ్యవసాయానికి ఊపిరి పోశాయి. 2014-15లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు ఉండగా, ఇది 2022-23 నాటికి 2.38 కోట్లకు పెరిగింది. పదేండ్లలోనే కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరగటం దేశ వ్యవసాయరంగ చరిత్రలో రికార్డు. పంట ఉత్పత్తి 1.50 కోట్ల టన్నుల నుంచి 3.62 కోట్లకు పెరిగింది.
2014-15లో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు కాగా, 2022-23లో ఇది ఏకంగా 121 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే తొమ్మిదేండ్లలో 86 లక్షల ఎకరాల్లో వరి సాగు పెరగటం గమనార్హం. వరి సాగు పెరగడంతో ధాన్యం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. 2014-15లో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2022-23 నాటికి ఇది 2.60 కోట్లకు చేరింది. ఆ పంటనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసింది. 2014-15లో కొనుగోలు చేసిన ధాన్యం 24.32 లక్షల టన్నులు మాత్రమే. 2021-22లో అది 120.60 లక్షలకు పెరిగింది. అంటే 187 శాతం పెరగటం గమనార్హం. గత ఏడాది వరకు మొత్తంగా రూ.1.33 లక్షల కోట్ల విలువైన 7.23 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో పంట సీజన్ ప్రారంభమవుతుందంటే చాలు రైతులు ఎవుసం పనులను వదిలేసి ఎరువులు, విత్తనాల కోసం పరిగెత్తే పరిస్థితి ఉండేది. పోలీస్స్టేషన్లలో పెట్టి మరీ ఎరువులు, విత్తనాలు అమ్మిన రోజులు రైతులకు ఇంకా గుర్తున్నాయి. ఎరువులు, విత్తనాల కోసం లాఠీ దెబ్బలు తిన్న పరిస్థితిని కూడా మర్చిపోలేదు. తెలంగాణ వచ్చాక ఈ పరిస్థితిని కేసీఆర్ పూర్తిగా మార్చేశారు. సీజన్కు ముందే ఎరువులు, విత్తనాలను తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచారు. 2014లో ఎరువుల వినియోగం 27 లక్షల టన్నులు కాగా, 2022-23లో ఇది 40 లక్షలకు పెరిగింది. అయినా ఎక్కడా ఎరువుల కొరత రాలేదు.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ‘రైతుబంధు’ పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రతి రైతుకు ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున.. ప్రతి సీజన్లో సుమా రు 65 లక్షల మందికి రూ.7,500 కోట్లు అందించారు. ఇప్పటి వరకు 11 విడతల్లో రూ. 72,815 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఉమ్మడి పాలనలో రైతుల ఆత్మహత్యలతో మరణం మృదంగం మోగేది. ఈ పరిస్థితిని చూసిన కేసీఆర్.. రైతుబీమా పథకాన్ని అమ లు చేశారు. ఏ కారణంతో అయినా సరే రైతు మరణిస్తే.. ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నారు. దానికి ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించింది. ఈ విధంగా వివిధ కారణాలతో మరణించిన సుమారు 1.15 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,566 కోట్ల పరిహారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది.
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు రుణవిముక్తి చేయడమే లక్ష్యంగా కేసీఆర్ రుణమాఫీని ప్రకటించారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.లక్ష వరకు రుణమాఫీ చేశారు.. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చాక రూ.లక్షమాఫీకి హామీ ఇచ్చిం ది. 2014లో తొలిసారి 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రెండోసారి 23 లక్షల మందికి రూ.13 వేల కోట్లను మాఫీ చేయగా మరో రూ.6 వేల కోట్ల రుణాల మాఫీ పెండింగ్లో ఉన్నది. ఎన్నికల కోడ్తో అడ్డంకి ఏర్పడింది.
వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన మరో కృషి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించారు. ఉచిత విద్యుత్తు, పవర్ డిస్ట్రిబ్యూషన్ లైన్ల మరమ్మతుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా రూ.75 వేల కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 9 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు పెరిగాయి.
రైతులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా.. మొత్తం 2,601 రైతు వేదికలను నిర్మించింది. అందుకు రూ.572 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది. ఈ వేదికల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, నూతన సాగు విధానాలపై అవగాహన కల్పించింది. 2014-15లో రాష్ట్రంలో గోదాముల సామ ర్థ్యం 39 లక్షల టన్నులు మాత్రమే ఉండగా 2023-24లో 74.04 లక్షల టన్నులకు పెరిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారుల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. అయితే రాష్ట్రం ఏర్పాటుకాగానే కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చి.. వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి బతుకుల్లో వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 2015లో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఏటా కనీసం రూ.వంద కోట్ల ఖర్చుతో పూర్తి ఉచితంగా చేపపిల్లల్ని పంపిణీ చేసింది. ఇప్పటి వరకు 414 కోట్ల చేపపిల్లల్ని పంపిణీ చేయగా వీటి ద్వారా 23 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. వీటి విలువ రూ.32 వేల కోట్లని అధికారులు అంచ నా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపలను ఇక్కడి వ్యాపారులు ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్, అస్సాం వంటి రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు.
రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు ను ప్రోత్సహించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 27 వేల ఎకరాల్లోనే ఆయిల్పామ్ సాగవుతుండగా, ప్రస్తుతం 2 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నది.
కుల వృత్తులను ప్రోత్సహించటంలో భాగంగా గొల్ల కురుమలకు కేసీఆర్ ప్రభు త్వం సబ్సిడీ గొర్రెల పంపణీని ప్రారంభించింది. ఈ పథకం కింద సుమారు రూ.6 వేల కోట్లు ఖర్చుచేసి 4.21 లక్షల గొర్రెల యూనిట్లను అందజేసింది (యూనిట్కు 21 గొర్రెలు). తద్వార రాష్ట్రంలో 1.5 కోట్ల గొర్రె పిల్లలు జన్మించాయి. ఈ పథకం వల్ల రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 2 కోట్లకు చేరింది. దీంతో దేశంలోనే గొర్రెలు అత్యధికంగా కలిగిన రాష్ర్టాల్లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. పాడి రైతులను ప్రోత్సహించేందుకు లీటర్ పాలకు రూ.4 ప్రోత్సాహకాన్ని అందించింది. ఇందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు ఖర్చుచేసింది. ఇక దేశంలోనే తొలిసారిగా సంచార పశు వైద్యశాలలను ఏర్పాటు చేసింది. తొలిదశలో 100 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంచార పశు వైద్యశాలల కోసం ఏటా రూ.30 కోట్ల చొప్పున సుమారు రూ.136 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణను ఆదర్శంగా తీసుకున్న కేంద్ర పశుసంవర్ధక శాఖ గతేడాది ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అమలు చేసింది.
కేసీఆర్ ప్రభుత్వం ఎంతో దీక్షతో, పట్టుదలతో, ముందుచూపుతో వ్యవహరించి 60 ఏండ్ల ఎవుసం గోసను తీర్చి గాడిలో పెడితే, కాంగ్రెస్ సర్కారు ఆర్నెల్లలోనే ఆగం చేస్తున్నది. రైతులకు మళ్లీ పదేండ్ల కిందటి గడ్డు పరిస్థితులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చిన రెండు నెలల్లోనే సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పంటలు ఎండిపోయాయి. కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయి. మళ్లీ రాత్రిపూట కరెంట్ మొదలైంది. పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కులేకుండా పోయింది. పెట్టుబడి సాయం అందటం లేదు. వడ్లుకు బోనస్ ఇస్తామని, ఇప్పుడు సన్నవడ్లకేనంటూ మాట మార్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే పదేండ్ల పాటు కష్టనష్టాలకు దూరంగా ఉన్న రైతులు మళ్లీ కష్టాల సుడిగుండంలో కూరుకుపోతున్నారు. సస్యశ్యామలంగా మారిన తెలంగాణ వ్యవసాయం.. మళ్లీ విధ్వంసం దిశగా అడుగులు వేస్తున్నది.
నోట్: రైతుల సంఖ్య- లక్షల్లో, పంపిణీ మొత్తం- కోట్లలో, విస్తీర్ణం- లక్షల ఎకరాల్లో పంపిణీ మొత్తం
72,817.04 కోట్లు