Transgenders | రాంనగర్ : కరీంనగర్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో పది మంది ట్రాన్స్ జెండర్లకు రూ. 30 వేల వేతనంతో అమెజాన్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మారుతున్న కాలానుగుణంగా యువతీ, యువకులు పోటీ పడాలని సూచించారు. సమాజంలో చిన్న చూపు చూడబడుతున్న ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించడం ద్వారా మున్ముందు సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. కాగా, ఈ జాబ్మేళాలో 120 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటికి సుమారు 4 వేల మంది ఉద్యోగార్థులు హాజరయ్యారు. ప్రముఖ కంపెనీలైన బైజూస్, విప్రో, జన్ప్యాక్, హెచ్సీఎల్, క్లస్టర్, ఐటీ, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, ఇండిగో, హెటిరో, అరబిందో లాంటి ఐటీ, ఫార్మా కంపెనీలతో పాటు బ్యాంకింగ్ సంస్థలు కూడా ఉద్యోగస్తులను రిక్రూట్ చేసుకున్నాయి. సుమారు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి నియమాక పత్రాలు అందజేశారు.