Heavy Rains | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొన్నది. వర్షాలకు వేర్వేరు ఘటనల్లో పది మంది మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. నాగర్ కర్నూలు జిల్లాలో ఆదివారం వర్షం కురిసింది. తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ శివారులో షెడ్ నిర్మాణంలో ఉండగా.. సాయంత్రం వర్షానికి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో కోళ్ల ఫామ్ యజమానితో పాటు అతని కుమార్తె, ఇద్దరు కూలిలో చనిపోయారు. మృతులను కోళ్లఫామ్ యజమాని మల్లేశ్ (40), అతని కూతురు అనూష (10), కూలీలు చెన్నమ్మ, రాము మృతి చెందారు. కూలీలు చెన్నమ్మ, రాము స్వస్థలం పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అలాగే, తెలకపల్లిలో పిడుగుపాటుకు ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నందివడ్డెమాన్ గ్రామంలోనూ ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వైపు నాగర్కర్నూల్, పాలెం, బిజినేపల్లి, తిమ్మాజిపేట, చెన్నపురావుపల్లి, కల్వకుర్తి, పదర, పెద్దూరు, తూడుకుర్తిలాంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఇదిలా ఉండగా.. కీసరలో ఈదురుగాలులకు చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. తిమ్మాయిపల్లి నుంచి షామీర్పేట వెళ్లేదారిలో చెట్టు విరిగిపడింది. దాంతో రాంరెడ్డి, ధనుంజయరెడ్డి అనే ఇద్దరు మృతి చెందారు. రాంరెడ్డి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడువగా.. చికిత్స పొందుతూ ధనుంజయరెడ్డి కన్నుమూశాడు. మృతుల స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మల రామారంగా గుర్తించారు. సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలకు గోడకూలి మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ములుగు మండలం క్షీరసాగర్లో కోళ్లఫారం కోడకూలింది. ఇదే ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి.