వేములవాడ/వేములవాడ టౌన్/ పాపన్నపేట, ఫిబ్రవరి 28: మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయం, మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రం, కీసర రామలింగేశ్వరాలయంతోపాటు అన్ని ఆలయాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొంటున్నారు. వేములవాడలో స్వామివారికి ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్బాబుతో కలిసి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టీటీడీ చైర్మన్ సతీమణి, ఆలయ అధికారులు పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు ఈవో రమాదేవి తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా వేములవాడలో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఏడుపాయలలో అమ్మవారికి ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.