తెలంగాణా రాష్ట్ర దేవాదాయ శాఖలో పనిచేస్తున్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక ఉద్యోగులకు నూతన పీఆర్సీ వర్తింపచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 114 విడుదల చేసింది. నూతన పీఆర్సీకి సహకరించిన పంచాయతీ రాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావును తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డి.వి.ఆర్.శర్మ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు.
అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కూడా ఆదివారం నాడు కలిశామని చెప్పారు. దేవాదాయశాఖలో కట్ ఆఫ్ తేదీ తొలగించి మిగిలిన 1252 మంది తాత్కాలిక అర్చక ఉద్యోగులను కూడా రెగ్యులర్ చెయ్యాలని, వారికి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలు నిరాదరణకు గురి అయ్యాయన్నారు.
మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలో మన దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని కొనియాడారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అర్చక ఉద్యోగులకు ఇంతటి వేతనాలు లేవని, తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రూ.152 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా సమాన వేతనాలు ఇస్తున్నారని చెప్పారు. కెసీఆర్ దిశానిర్దేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు.
భారత దేశానికి ఆదర్శం మన అర్చకుల వేతన విధానం అని ప్రశంసించారు. మన యాదాద్రి దేవాలయాన్ని 1800 కోట్ల రూపాయలతో దేశంలోనే అత్యున్నత దేవాలయంగా తీర్చి దిద్దుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అద్దంకి కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి నరేష్ శర్మ, వరంగల్ జిల్లా ప్రథాన కార్యదర్శి అభిలాష్ శర్మ, భీమన్న శర్మ తదితరులు పాల్గొన్నారు.