హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : భూసేకరణ చట్టం కింద దేవుడి భూమిని సేకరించడమే కాకుండా ఆ భూమికి ఇచ్చిన పరిహారంలో సగం అదే భూమిని ఆక్రమించుకున్న వారికి, మిగిలిన సగం నోరు లేని దేవుడికి ఇచ్చిన భూబాగోతం హైకోర్టుకు చేరింది. ఇక ఎకరాకు రూ.30 లక్షలు చెల్లించి సేకరించిన ఈ దేవుడి భూమిని ప్రభుత్వం ఓ కంపెనీకి కేటాయించగా.. ఆ కంపెనీ ఈ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.2.5 కోట్లు అప్పు తెచ్చుకోవడంతో తెల్లబోవడం దేవుడి వంతైంది. ప్రభుత్వం దేవుడిని ఏవిధంగా నిండా ముంచేసిందో వివరించే ఈ సన్నివేశాన్ని ఓ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో ఆలయ భూమితోపాటు ఇతరుల భూములను ప్రభుత్వం నామమాత్ర ధరకు సేకరించి ప్రైవేట్ కంపెనీలకు కేటాయించింది.
సీతారాంపూర్లోని సర్వే నంబర్ 1663 నుంచి 1672 వరకు 1148 ఎకరాల భూమిని సేకరించడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త పేరాల శేఖర్రావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దేవాదాయశాఖ భూమిని ప్రభుత్వం భూసేకరణ చట్టం కింద సేకరించడం చట్టవిరుద్ధమని చెప్పారు. ఆ ప్రాంతంలో ఎకరం ధర కోట్ల రూపాయలు పలుకుతుండగా.. టీజీఐఐసీ కేవలం రూ.30 లక్షలకే కేటాయించడం దారుణం అని అన్నారు. ఆ భూమిని ఇటీవల కంపెనీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.2.5 కోట్ల రుణం తీసుకుందని చెప్పారు.
కోట్లాది రూపాయల విలువైన ఆలయ భూమిని నామమాత్రపు ధరలతో తీసుకుని దేవుడికి అన్యాయం చేసినట్టు స్పష్టం అవుతున్నదని తెలిపారు. దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్రెడ్డి స్పందిస్తూ.. ఇప్పటికే భూసేకరణ పూర్తయిందని, పరిహారం కింద రూ.178 కోట్లు చెల్లించామని తెలిపారు. ప్రైవేటు కంపెనీ ఓలెక్ట్రా గ్రీన్లెక్ లిమిటెడ్ తరఫు సీనియర్ న్యాయవాది కే వివేక్రెడ్డి వాదిస్తూ. కేటాయించిన భూమిలో కంపెనీ ఏర్పాటు చేశామని, ఇందులో వందల మంది ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. వాదనల తర్వాత ఇప్పటికే నోటీసులు అందుకున్న కంపెనీకి మినహా మిగిలిన వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.