Summer | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు( Summer ) మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. అయితే సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు( Temperatures ) నమోదయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ( Weather Dept ) హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
నేటి నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆ ఏడు జిల్లాల ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంగ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలో ఎండలు మండిపోయే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఆ ఏడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించింది.
గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ, జగిత్యాల, ఆదిలాబాద్, మహబూబ్నగర్, గద్వాల, వికారాబాద్, యాదాద్రి, ఆసిఫాబాద్, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఉష్ణోగ్రతలు 35.9 డిగ్రీలు దాటితే వాతావరణ శాఖ మూడు రకాల అలర్ట్లను జారీ చేస్తుంది. 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటే ఎల్లో అలర్ట్, 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పెరిగితే ఆరెంజ్ అలర్ట్, 45 డిగ్రీల పైన నమోదైతే రెడ్ అలర్ట్లను జారీ చేస్తుంది వాతావరణ శాఖ.