Weather | హైదరాబాద్ : తెలంగాణలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాగల మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శనివారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.
నిన్న మన్నార్ గల్ఫ్ నుఎంచి దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగిన ద్రోణి.. గురువారం కోమరిన్ ప్రాంతం నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.