Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో వానలు తగ్గుముఖం పట్టాయి. రెండు వారాలుగా ప్రతి రోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చల్లటి వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఎండల తీవ్రత పెరిగింది. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సోమవారం అన్ని జిల్లాల్లో 35 డిగ్రీలు దాటి 40 డిగ్రీలకు చేరువయ్యాయి.
ఆదిలాబాద్లో అత్యధికంగా 39.8 డిగ్రీలు, భద్రాచలం-కొత్తగూడెంలో 38, హనుమకొండలో 37.5, హైదరాబాద్లో 36.3, ఖమ్మంలో 38.6, మహబూబ్నగర్లో 35.4, మెదక్లో 37.6, నల్లగొండలో 39, నిజామాబాద్లో 38.4, రామగుండంలో 39.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బుధవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి, రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సుమారుగా 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలోని సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ-గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మంగళవారం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.