హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత (Cold Weather) పెరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ఎకువగా ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.3 డిగ్రీలు నమోదయింది. అదేవిధంగా న్యాల్కల్లో 9.6 డిగ్రీలు, గుమ్మడిదలలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక మెదక్ జిల్లా శివ్వంపేటలో 10 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 10.2 డిగ్రీలు నమోదయింది.
సోమవారం రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డయిన విషయం తెలిసిందే. సిర్పూర్(యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 8.8, ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.9 డిగ్రీలు నమోదైంది. జోగులాంబ గద్వాలలో 15.1, సూర్యాపేటలో 15.6, వనపర్తిలో 15.9 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగటానికి కారణమని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడ్రోజులు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన 27 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్లో ఉష్ణోగ్రతలు తకువ స్థాయికి పడిపోతుంటాయి. ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్లోనే చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పదేళ్లతో పోల్చితే ఈ నెల 23న రాత్రి నాలుగు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.