Summer | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. భానుడు నిప్పులు కక్కుతున్నడా అనిపిస్తున్నది. మండే ఎండలకు తోడు ఉక్కపోతకు ప్రజలు ఉకిరిబికిరి అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మారును దాటి ఎండలు మండుతున్నాయి. సోమవారం ఏడు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఈ జిల్లాలోని మాటూరు, తిమ్మాపురంలో 45.1 డిగ్రీలు, నిడమనూరు, కామారెడ్డిగూడెంలో 44.8, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 45.3 , ములుగు జిల్లా మంగపేటలో 45.3, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లేగొరి మండలం రాగొంలో 45.2, ఖమ్మం జిల్లా చింతకానిలో 45.1, వనపర్తి జిల్లా పాన్గల్లో 45.1, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ను జారీ చేసిం ది. మహబూబాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఎండ తీవ్రత కొనసాగింది. ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాలులు వీచినట్టు అధికారులు తెలిపారు. మంగళవారం కూడా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
7 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. సోమవారం ఏడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు, మరో 26 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిరుడు ఏప్రిల్తో పోలిస్తే 4.5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. గత ఏప్రిల్ 29న రాష్ట్ర సగటు అత్యధిక ఉష్ణోగ్రత 40.9 డిగ్రీలుగా రికార్డయింది. నిరుడు 11 జిల్లాల్లో 35 డిగ్రీలలోపు, 22 జిల్లాల్లో 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరికొంత పెరిగే అవకాశం ఉంటుందని, వృద్ధులు, పిల్లలు, వీధి వ్యాపారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.