హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాదిలో మార్చి రాక ముందే ఎండలు కొడుతున్నాయి. హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలుగా నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీలు నమోదవడం గమనార్హం. ఎప్పుడైనా ఫిబ్రవరిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలలోపే నమోదయ్యేవి. ఈసారి 34 డిగ్రీలు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది.
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో వేసవి తరహా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు వారాల తర్వాత ప్రారంభయ్యే ఉష్ణోగ్రతల పెరుగుదలను భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇది హైదరాబాద్లో వేసవి ప్రారంభ ఆగమనాన్ని తెలుపుతుందని, నగరంపై శీతాకాలపు పట్టు సడలుతుందని పేర్కొన్నది.
రెండువారాల తర్వాత ఎండల తీవ్రత
ఈ నెల మధ్యకాలం తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. వచ్చే ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయి. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 31-33 డిగ్రీల మధ్య ఉంటుంది. పగలు వెచ్చగా మారుతున్నప్పటికీ, రాత్రులు హాయిగా ఉంటాయి. తెల్లవారుజామున పొగమంచు ఏర్పడుతుంది.
– డాక్టర్ ఏ శ్రావణి, భారత వాతావరణ విభాగం శాస్త్రవేత్త, హైదరాబాద్