Summer | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్నది. ఈ సీజన్లోనే అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ కేంద్రం రెడ్అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రత 39 నుంచి 41 డిగ్రీలకు చేరిందని, రాబోయే నాలుగు రోజులు ఇవే గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పులు వీచే అవకాశమున్నదని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో కూడా గతంలో కంటే భిన్నంగా మార్చిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37-38 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీలపైనే రికార్డు అయ్యింది. మరోవైపు ఎండలు పెరుగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరించారు.
పొడిగాలులే కారణం..
ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత ఎండలు పెరుగుతాయి. కానీ ఈసారి తొలి వారంలోనే వేడి తీవ్రత మొదలైంది. శనివారం ఆరు జిల్లాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జయశంకర్-భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
హీట్వేవ్తో జాగ్రత్త!
రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) రవీందర్ నాయక్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తరుచుగా తగిన మోతాదులో నీరు తాగాలని సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రయాణాలను తగ్గించుకోవాలని కోరారు.