హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణంకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి మంచుదుప్పటి కమ్మేస్తుంది. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రంభీం జిల్లాలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్(యూ)లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్ డీపీఎస్ తెలిపింది.
తిర్యాని 9.3, వాంకిడిలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 9.7, బేల (ఆదిలాబాద్ ) 9.7, భోరజ్ (ఆదిలాబాద్) ర్యాలీ (మంచిర్యాల)లో 10, పొచ్చెర (ఆదిలాబాద్) 10.1, నీల్వాయి (మంచిర్యాల) 10.2, ధూల్మిట్ట (సిద్ధిపేట) 10.3, పెంబి (నిర్మల్) 10.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రతతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. పలుచోట్ల పొగమంచు పేరుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.