హైదరాబాద్: శీతల గాలులు (Cold waves) వీస్తుండటంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత మరింత అధికమయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లి (టీ)లో అతి తక్కువగా 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అదేవిధంగా జైనాద్, బేలా (ఆదిలాబాద్), గిన్నెదరి (కుమ్రం భీం) 6.3, ఛప్రాలా (ఆదిలాబాద్), కోహిర్ (సంగారెడ్డి) 6.4, రెడ్డి పల్లె (రంగారెడ్డి) 6.6, వాంకిడ్ (కుమ్రం భీం) 6.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 29 జిల్లాల్లో 10 డిగ్రీలలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరికొన్ని రోజులపాటు రాష్ట్రంలో చల్లటి గాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.