హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): నవతరం కథకులు భాషపై మరింత పట్టు పెంచుకోవాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ కిషన్రావు సూచించారు. మనిషి గుండెలోని ఆర్థ్రత కథా వస్తువుగా ఉండాలని అభిలషించారు. ముల్కనూర్ ప్రజాగ్రంథాలయం సాహిత్యపీఠం, ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఏటా జాతీయ కథల పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2022 జాతీయ కథల పోటీల అవార్డుల ప్రదానోత్సవం తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం వైభవంగా కొనసాగింది. కార్యక్రమానికి వీసీ కిషన్రావు, బలగం సినిమా డైరెక్టర్ యెల్దండి వేణు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కిషన్రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం వెలువడుతున్న కథా సాహిత్యం తీరును ప్రశంసించారు.
కథకులకు విలువ ఇవ్వాలి: సినీ డైరెక్టర్ వేణు
ప్రస్తుత సమాజంలో కథా రచయితలకు విలువ లేకుండా పోయిందని బలగం సినిమా డైరెక్టర్ యెల్డండి వేణు విచారం వ్యక్తంచేశారు. సినిమాల విజయవంతానికి కథా బలమే మూలమని వివరించారు. కథకులకు ప్రతిఒక్కరూ విలువ ఇవ్వాలని అభిలషించారు. ముల్కనూర్ ప్రజాగ్రంథాలయం, ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక చేపట్టిన ప్రయత్నం చాలా గొప్పదని, రచయితలకు గుర్తింపునివ్వడంతోపాటు ప్రోత్సహించడంపై హర్షం వ్యక్తం చేశారు. కథా రచయితలు కూడా కథ అనగానే సమాజంలోని సమస్యలను పూర్తి వైరాగ్యంతో, ఆవేదనతో వెలిబుచ్చడం కాకుండా, ఆధునిక యువతను, పాఠకులను ఆకర్షించే రీతిలో రచనలు సాగించాలని కోరారు. సమస్యలను కూడా ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో చెప్పగలిగితే కొత్త తరం పాఠకులు వస్తారని అభిప్రాయపడ్డారు. కథా విజేతలకు అభినందనలు తెలియజేశారు.
వైభవంగా అవార్డుల ప్రదానోత్సవం
అనంతరం ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం సాహిత్య పీఠం, డబ్ల్యూఎస్వో సంస్థల ఆధ్వర్యంలో దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్కు ‘నవ కవితాభిమాన్యు’ బిరుదును ప్రకటించారు. మెమెంటోను, రూ. లక్ష రివార్డు అలిశెట్టి కుటుంబీకులకు అందజేసి సత్కరించారు. అనంతరం ముల్కనూర్ ప్రజాగ్రంథాలయం, ‘నమస్తే తెలంగాణ’ కథా పోటీల విజేతలకు అవార్డులను అందజేశారు. మొదటి బహుమతి గెలుచుకున్న ‘ఇబ్లిస్’ కథా రచయిత హుమాయున్ సంఘీర్కు రూ.50 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించారు.
ద్వితీయ బహుమతులు (ఇద్దరికి) రూ.25 వేలు చొప్పున (కథ – అడవి పువ్వు, రచయిత్రి – కిరణ్ విభావరి; కథ – ఇసప్పురుగు, రచయిత-మద్దెర్ల రమేశ్), తృతీయ బహుమతులు (ముగ్గురికి) రూ.10 వేలు చొప్పున (కథ – వలస కలలు, రచయిత – ధర్మశాంతి ప్రభాకర్రావు; కథ – మసురు, రచయిత్రి – స్ఫూర్తి కందివనం; కథ- ఏలి ఏలి లామా సబక్తానీ, రచయిత – సుగుణరావు) బహూకరించారు, వారితోపాటు ప్రత్యేక బహుమతులు, కన్సొలేషన్ బహుమతులు పొందిన వారికి నగదు ప్రోత్సాహకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ జడ్పీ వైస్ చైర్మన్ సుధీర్కుమార్, క్రెడాయ్ చైర్మన్ రామకృష్ణారావు, ములకనూర్ సర్పంచ్ మాడుగుల కొంరయ్య, జడ్పీటీసీ వంగ రవి, డీసీపీ గిరిధర్, శశిధర్, ప్రజా గ్రంథాలయం ముఖ్య సలహాదారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ జాయింట్ ఇన్స్పెక్టర్ వేముల శ్రీనివాసులు, నమస్తే తెలంగాణ దినపత్రిక బతుకమ్మ, జిందగీ ఫీచర్స్ ఇన్చార్జి కరణం జనార్దన్, రచయితలు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంబురంగా రచయితల ఇష్టాగోష్టి
అవార్డుల ప్రదానోత్సంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రవీంద్రభారతి మినీహాల్లో రచయితల ఇష్టాగోష్టి నిర్వహించారు. ముల్కనూరు ప్రజా గ్రంథాలయం ముఖ్య సలహాదారు వేముల శ్రీనివాసులు ఆధ్వర్యంలో కొనసాగించిన ఈ కార్యక్రమంలో అవార్డులు పొందిన రచయితలందరూ పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు. కథల పోటీ ఔన్నత్యాన్ని కొనియాడారు. తమ కథల ప్రేరణను, పొందిన స్ఫూర్తిని వివరించారు. పలువురు సీనియర్ రచయితలు కథా రచనలో పాటించాల్సిన జాగ్రత్తలను సూచించారు.