హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : తెలుగు వర్సిటీలో తొలిసారిగా ప్రవేశపెట్టిన యోగా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ప్రత్యేకించి పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సుపై అత్యధికులు ఆసక్తిచూపుతున్నారు. ఇప్పటికే 100 అడ్మిషన్లు నమోదయ్యాయి. త్వరలోనే కొత్త బ్యాచ్ను ప్రారంభించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు వర్సిటీలో ఈ ఏడాది కొత్తగా యోగా డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పీజీ డిప్లొమా ఇన్ యోగా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఏడాది వ్యవధి ఉన్న పీజీ డిప్లొమా కోర్సులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. విద్యార్థులు 60 క్రెడిట్స్ పొందితే కోర్సు పూర్తయినట్టు లెక్క. డిగ్రీ పూర్తిచేసిన వారికి పీజీ డిప్లొమా కోర్సు, ఇంటర్ విద్యార్హత ఉన్న వారికి డిప్లొమా కోర్సు, పదో తరగతి చదివిన వారికి సర్టిఫికెట్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు.
వర్సిటీలో ఈ ఏడాది నుంచి నాలుగేండ్ల అనర్స్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టారు. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ప్రొడక్ట్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ విజువల్ కమ్యూనికేషన్, బ్యాచిరల్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇంటీరియర్ డిజైన్ కోర్సులను ఆనర్స్ కోర్సులుగా ప్రవేశపెట్టారు. ఈ కోర్సులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి.
యూనివర్సిటీలో ప్రవేశాలు ఏటా పెరుగుతున్నాయి. 2020లో యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందిన వారి సంఖ్య 253 మాత్రమే ఉండగా, 2021లో 550కి చేరుకొన్నది. ఈ ఏడాది ఇప్పటికే వెయ్యి మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. బీఎఫ్ఏ, లైబ్రరీ సైన్స్, తెలుగు, జర్నలిజం కోర్సుల్లో అధికంగా చేరుతున్నారు.
– తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్