హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ): తెలుగు భాషకు రాష్ట్రప్రభుత్వం వెలుగులద్దుతున్నది. ఆంగ్ల మాధ్యమంతో తెలుగుపట్ల నిర్లక్ష్య ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల స్థాయిలో తెలుగు బోధనను విడతలవారీగా తప్పనిసరి చేస్తున్నది. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో 1, 2, 3, మాధ్యమిక స్థాయిలో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు తెలుగు బోధనను తప్పనిసరి చేసింది. తాజాగా 2021-22 విద్యాసంవత్సరానికి 4, 9వ తరగతులకు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రప్రభుత్వ ఆధీనంలోని పాఠశాలలే కాకుండా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డుల పాఠశాలల్లోనూ తెలుగును విధిగా బోధించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్నిరకాల ప్రైవేటు పాఠశాలల్లో కూడా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని స్పష్టంచేసింది. అన్ని రకాల మాధ్యమాలు, యాజమాన్యాల్లోని పాఠశాలల్లో దీనిని పాటించాలని ఉత్తర్వులిచ్చింది. స్కూళ్లలో తెలుగు బోధనకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని డీఈవోలను ఆదేశించింది. రాష్ట్రంలో 2018 నుంచి విడతలవారీగా తెలుగును తప్పనిసరి బోధనాంశంగా అమలుచేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో 5, 10వ తరగతులకు తెలుగును తప్పనిసరి చేయనున్నారు. దాంతో 1నుంచి 10వ తరగతి వరకు పాఠశాల విద్యలో సంపూర్ణంగా తెలుగును బోధించటం మొదలవుతుంది.
తెలుగంటే నిర్లక్ష్యం..
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో 1 నుంచి 8వ తరగతి వరకు త్రిభాషా సూత్రం ప్రకారం ఏవైనా మూడుభాషలను నేర్పిస్తున్నారు. ఎక్కువమంది విద్యార్థులు హిందీ, ఇంగ్లిష్తోపాటు తెలుగును కూడా నేర్చుకొంటున్నారు. అయితే, యాజమాన్యాలు హిందీ, ఇంగ్లిష్పై చూపినంత శ్రద్ధ తెలుగుపై చూపటంలేదనే విమర్శలున్నాయి. 9, ఆపై తరగతుల్లో ఏవేని రెండుభాషలను మాత్రమే నేర్చుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ఆ తరగతులకు తెలుగును పక్కనపెట్టేస్తున్నారు. తాజాగా 9వ తరగతికి కూడా తెలుగును తప్పనిసరిచేయడంతో అన్ని యాజమాన్యాలలోని స్కూళ్లు తెలుగును తప్పనిసరిగా బోధించాలి. ఈ తరగతులకు సంబంధించిన తెలుగు పాఠ్యపుస్తకాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. 4,9వ తరగతుల పాఠ్యపుస్తకాలను కూడా ఎస్సీఈఆర్టీ వెబ్సైట్లో ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చింది.
తెలుగు రక్షణకు ప్రభుత్వం కృషి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష రక్షణ, అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. 2017 డిసెంబర్లో హైదరాబాద్లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్రంలోని విద్యార్థులంతా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చదివేలా చట్టం తెస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతకుముందే 2017 నవంబర్లో ఒక కమిటీని నియమించి పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో అధ్యయనం చేయించారు. 2018 -19 సంవత్సరం నుంచి తెలుగును తప్పనిసరి బోధనాంశంగా అమలుచేసేలా శానససభ, శాసనమండలిలో 2018 మార్చి 30న బిల్లును ఆమోదించారు. ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు, మాధ్యమాల్లోని పాఠశాలల్లో తెలుగును విధిగా నేర్పాలని 2018 జూన్ 29న విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.
ఎవరికీ మినహాయింపు లేదు..
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలోని తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో తెలుగు ఇప్పటికే అమల్లో ఉన్నది. ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ మాధ్యమ పాఠశాలల్లో , సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ గుర్తింపు స్కూళ్లలో కూడా దశలవారీగా తెలుగును అమలుపరుస్తున్నారు. ఇతర మాధ్యమ పాఠశాలల్లో తెలుగును బోధించడానికి ఉపాధ్యాయులు, విద్యా వలంటీర్లను ప్రభుత్వమే నియమిస్తున్నది. ఏ స్కూళ్లలో అయినా ఎస్సీఈఆర్టీ రూపొందించిన తెలుగు వాచకాలనే వినియోగించుకోవాలి. తెలుగు సబ్జెక్టులో కూడా నిరంతర సమగ్ర మూల్యాంకనం నిర్వహించాలి.
ఉల్లంఘిస్తే మూసివేతే..
తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్గా బోధించకున్నా, తెలుగు భాషా ఉపాధ్యాయుడిని నియమించకున్నా, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పాఠ్యపుస్తకాలను వినియోగించకపోయినా పాఠశాల గుర్తింపును రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. ఏదైనా పాఠశాల తెలుగు అమలు చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలిస్తే జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఆ స్కూలుకు నోటీసు జారీచేస్తారు. దీనికి స్కూలు యాజమాన్యం 15 రోజుల్లో సమాధానమివ్వాలి. ఆ వివరణపై అధికారులు మళ్లీ పర్యవేక్షణ జరుపుతారు. ఉల్లంఘన నిజమేనని తేలితే మొదటి తప్పుగా భావించి స్కూలుకు జిల్లా కలెక్టర్ రూ.50వేల వరకు జరిమానా విధించే అవకాశమున్నది. అదే పాఠశాల రెండోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1 లక్ష ఫైన్ విధిస్తారు. మూడోసారి ఉల్లంఘనకు పాల్పడితే పాఠశాల గుర్తింపు రద్దుచేస్తారు.