పచ్చ పత్రికలు ఏదో ఒక వంకతో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అకాలవర్షాలతో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ వచ్చిన తర్వాత మార్కెట్యార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తొక్కిపెట్టింది.
Eenadu | హైదరాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): రాష్ట్రం మారినా.. ఆంధ్రా పచ్చ పత్రికల బుద్ధి మాత్రం మారటం లేదు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈనాడు పత్రిక మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. వరుణుడి ప్రకోపానికి రాష్ట్రప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అబద్ధపు కథనం ప్రచురించింది. మార్కెట్యార్డుల్లో సౌకర్యాలు లేవంటూ, అవసరమైన సామర్థ్యం గల గోదాములు లేవంటూ విషపు రాతలను రాసింది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం రైతులు మార్కెట్ యార్డులకు, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తమ పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు, నిల్వ చేసుకునేందుకు అన్ని సౌకర్యాలను కల్పించింది. ఇందుకోసం కొత్తగా మార్కెట్యార్డుల్లో షెడ్డులను నిర్మించింది, కొత్త గోదాములను నిర్మించింది, యార్డులలో సిమెంట్తో బెడ్ వేయించింది. ఈనాడు ప్రచురించిన తప్పుడు వార్త నేపథ్యంలో నిజానిజాలేంటో ఓసారి పరిశీలిద్దాం.
రెట్టింపైన గోదాముల సామర్థ్యం
తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎక్కడో ఒక చోట మాత్రమే గోదాములు ఉండేవి. కానీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న విప్లవాత్మకమైన వ్యవసాయ పథకాలతో పంట ఉత్పత్తులు భారీగా పెరిగాయి. వాటిని నిల్వ ఉంచేందుకు ప్రభుత్వం గోదాముల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. ఇందులో భాగంగానే తొలినాళ్లలో రాష్ట్రంలో కేవలం 39 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములు సుమారు 700 మాత్రమే ఉండేవి. కొత్తగా మరో 800 గోదాములు నిర్మించిన ప్రభుత్వం ఈ సామర్థ్యాన్ని 74 లక్షల టన్నులకు పెంచింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాముల సామర్థ్యాన్ని సుమారు నాలుగింతలు పెంచింది. 2014-15లో 7.38 లక్షల టన్నుల సామర్థ్యంగల 688 గోదాములు ఉండగా కొత్తగా 500 లకుపైగా గోదాములు నిర్మించింది. తద్వారా సామర్థాన్ని 24.66 లక్షల టన్నులకు పెంచింది.
70 కొత్త షెడ్ల నిర్మాణం
ప్రతి జిల్లా మార్కెట్యార్డుల్లో నాలుగైదు కొత్త షెడ్డులను నిర్మించింది. 1.12 లక్షల చ.మీటర్ల విస్తీర్ణం గల 70 కొత్త షెడ్డులను నిర్మించింది. ఇందులో అత్యధికంగా మెదక్ మార్కెట్యార్డులో 18 షెడ్డులు, కరీంనగర్లో 11, వరంగల్, నల్గొండలో 9 చొప్పున నిర్మించింది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు 2.78 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం గల 581 షెడ్డులు ఉండగా ప్రస్తుతం ఇది 3.90 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం గల 651 షెడ్డులకు పెరిగింది.
3 లక్షల టార్పాలిన్స్ పంపిణీ
కొనుగోలు కేంద్రాలకు, మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులకు వర్షాల నుంచి రక్షణ కల్పించేందుకు మార్కెటింగ్శాఖ టార్పాలిన్స్ను సబ్సిడీలో పంపిణీ చేస్తున్నది. ఈ విధంగా ఇప్పటి వరకు 3 లక్షల టార్పాలిన్స్ను రైతులకు అందించింది. ఈ యాసంగి సీజన్కు సంబంధించి మరో 45 వేల టార్పాలిన్స్ను సరఫరా చేస్తున్నది. అంటే ఇప్పటివరకు మొత్తం 3.45 లక్షల టార్పాలిన్స్ను అందించింది. దీంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 6,787 ప్యాడీ క్లీనర్స్ సరఫరా చేయగా ఈ సీజన్లో కొత్తగా మరో 1,518 అందించింది. అదే విధంగా 13,836 వెయింగ్ మిషన్లను, 12,737 తేమ శాతం కొలిచే మీటర్లను సరఫరా చేసింది.