ఎవుసానికి రంది లేదు
పెట్టుబడి ఎట్లా అన్న రంది లేదు. నగానట్రా తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. గతంలో మస్తు ఇబ్బందులు పడ్డం. ఇపుడు టైంకి రైతుబంధు పైసలొస్తున్నయి. ఎరువులు, విత్తనాలను ముందే తెచ్చుకొంటున్నం. రైతుల కష్టాలు తెలిసిన కేసీఆరే పాలకుడు కావడంతో సమస్యలన్నీ దూరమయినయి. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు సాయం ఆపకుండా ఇచ్చిండు. నాకు ఏడు ఎకరాలు ఉండగా, కొడుకుకు మూడు ఎకరాలు పంచిన. వడ్డీలకు పైసలు తెచ్చి సంసారాన్ని నెట్టుకొచ్చే దుస్థితి నుంచి బయటపడిన. శనివారం 4 ఎకరాలకు రూ.20 వేలు పడినట్టు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. యాసంగి నాట్లు వేసుకొంటున్న సమయంలో చేతికి డబ్బులు అందినయ్. కేసీఆర్ సర్కార్ ఉండగా మాకు రంది లేదు.
-ఎలబోయిన వెంకటేశ్వర్లు-సమ్మక్క, చీటకోడూరు, జనగామ జిల్లా
కేసీఆర్ వచ్చినంకనే బాగుపడ్డం
నాకు 10 ఎకరాలు భూమి ఉన్నది. గతంలో భూగర్భ జలాలు లేక మస్తు ఇబ్బంది పడ్డం. కరెంటు సరిగ్గా వచ్చేది కాదు. సగం భూమి కూడ సాగు చేయక పోయేది. ఉన్న పంటకు పెట్టుబడి పెట్టాల్నంటె పైసలు ఎల్లకపోయేది. రైతుబంధు పథకం పెట్టినప్పటి నుంచి పనులకు యాభై వేల రూపాయలు బ్యాంకుల పడుతున్నయి. అప్పుల కోసం ఎక్కడికి పోవాల్సిన పనిలేదు. సాగునీటి సౌలత్ పెరిగింది. మొత్తం భూమిని సాగు చేస్తున్న. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంకనే వ్యవసాయంలో లాభాలు చూస్తున్నం. కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
-కొమ్మిడి పెరుమాల్రెడ్డి, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా
ఎవరన్నా గిట్ల ఇచ్చిన్రా ?
నాకు నాలుగు ఎకరాలు ఉన్నది. రైతు కష్టం తెలిసినోడు కేసీఆర్ సారు. అందుకే పంటకు పెట్టుబడి ఇస్తున్నడు. ఎకరానికి రూ.5 వేలు బరాబర్ సరిపోతున్నయి. నా చిన్నతనం నుంచే ఎవుసం చేస్తున్న. కూలీల ఖర్చు, కోతలు, ఆ తర్వాత వాడే మందులు అవన్నీ మేం పెట్టుకునేటివేనాయె. ఓ వైపు కేసీఆర్ పెద్దఖర్చు తప్పిస్తనే ఉండే. ఇగ నేను పెట్టుకునేది ఏముంది.మొదటి సంది నాకు రైతుబంధు పడుతుంది. 9 సార్లు తీసుకున్న.. శనివారం పదోసారి రూ.20 వేలు ఖాతాలో పడ్డయి. గతంలో ఎవరన్న గిట్ల ఇచ్చిన్రా. కేసీఆర్తో తప్ప వేరే ఎవరి తరం కాదు. ఉచితంగా 24 గంటల కరెంటు వస్తుంది. అర్ధరాత్రి లేచి పొలాలకు పోవుడు తప్పింది. నీళ్ల కష్టం అసలు లేనే లేదు.
– అప్పని వెంకటయ్య, లక్ష్మీపూర్, లక్షెట్టిపేట మండలం, మంచిర్యాల
పైసలు పడ్డయి ఇగ నాటేత్త
నాకు 2 ఎకరాలు భూమి ఉన్నది. పొలం దున్ని రెడీగా పెట్టిన. నాటు ఏద్దామంటె కైకిలోళ్లు నగదు పైసలిత్తేనే వత్తమంటున్నరు. గందుకోసమే వేరేటోళ్లకు పిండి సల్లెతందుకు కూలికి అచ్చిన. రైతుబంధు పైసలు పడ్డట్టు ఇయ్యాల్నే (శనివారం) ఫోన్కు మెసేజ్ వచ్చింది. రేపు నాటేత్త. రైతుబంధు పైసలు టైంకు పడుతుండడంతో అప్పులు తెచ్చుడు తప్పుతున్నది.కేసీఆర్ సారుకు నేనైతే రుణపడి ఉంటా. ఆయన పసలు, పసలుకు పైసలేసి రైతులను ఆదుకుంటాండు. సీఎం సారును దేవుడు సల్లగ సూడాలె. ఎవుసానికి సాయం జేత్తాండు. మా అసోంటి బక్క రైతులను ఆదుకుంటున్నడు.
– పోలు కిట్టయ్య, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా
ఎవుసం పండుగైంది
నాకు ఎకరం 20 గుంటల భూమి ఉన్నది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం ఏటా రెండు సీజన్లలో పెట్టుబడి సాయం చేస్తున్నది. యాసంగిలో 8,250 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. గతంలో పెట్టుబడి డబ్బులకు పడని గోస లేదు. ఇప్పుడు రైతుబంధుతో ఆ రంది తీరింది. రైతుబంధు సాయం దున్నకాలకు ఎంతో ఉపయోగ పడుతున్నది. కేసీఆర్ సార్ పాలనలో రైతు రాజుగా మారిండు.
– చిన్నం గణేశ్, మైలారిగూడెం, యాదాద్రి జిల్లా
రైతుబంధు టంచన్గా వస్తున్నది
నాకు 2.10 ఎకరాల భూమి ఉన్నది. వ్యవసాయమే జీవనాధారం. యాసంగి పెట్టుబడికి రైతుబంధు పైసలు రూ.11,375 పడ్డయి. సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సీజన్లో రైతుబంధు డబ్బులు ఏస్తుండు. ఇప్పటివరకు ప్రధాని మోదీ పైసలు రాలేదు. పీఎం కిసాన్ కింద వచ్చేవి రూ.6వేలు. అవి కూడా మూడుసార్లు ఇస్తుండ్రు. కానీ, కేసీఆర్ ఇచ్చే రైతుబంధు పైసలు మాత్రం సమయానికి వచ్చినయి. కూరగాయలు సాగు చేస్తున్న.
-మన్నె పాండు, మల్లేపల్లి, సంగారెడ్డి జిల్లా
బతుకులు మంచిగైనయ్
నాకు 3 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నది. తెలంగాణ రాక ముందు లాగోడికి రూ.3 లెక్క మిత్తికి అప్పులు తెచ్చుకుంటుంటిమి. అప్పు, మిత్తి కట్టడానికే పండిన పంట సరిపోతుండే. చేతికొచ్చిన పంటతో రూపాయి కూడా మిగలక ఒక్కోపారి చావాలనిపించేది. మస్తు కష్టాలను ఓర్చినం. సీఎం కేసీఆర్ సారు వచ్చినంకా మా బతుకులు మంచిగయినయ్. రైతుబంధుతో లాగోడికి అప్పుల తిప్పలు తప్పినయి. రైతుబంధు కింద రూ.18 వేల మీద కొంత వస్తుంది. మందులు, విత్తనాలకు సరిపోతున్నాయి. పండిన పంటతో పైసలు మిగులుతున్నాయి. ఇప్పుడు బేఫికర్గుంది. రైతుల కోసం ఇంత చేస్తున్న కేసీఆర్ సార్ మంచిగుండాలె.
-పొట్ట యాదయ్య, బొంరాస్పేట, వికారాబాద్ జిల్లా
నీళ్లిచ్చిండు..కరెంటిచ్చిండు
మాకు 4 ఎకరాల భూమి ఉన్నది. రైతుబంధు అచ్చిన సంది కొంచెం బాధలు తప్పినయ్. అప్పట్ల పెట్టువడి కోసం తిప్పలువడేది. ప్రతి పసలుకు ఎంతో కొంత అప్పుతెచ్చేది. గిప్పుడు అట్ల లేదు. పొలం దున్నక ముందే కేసీఆర్ సార్ రైతుబంధు పైసలు ఏస్తున్నడు. అట్లవోయి ఇట్ల తెచ్చుకుని మందు బస్తాలు తెచ్చుకుంటున్నం. మందుబస్తాలు కొనంగా ఏమన్న పైసలు మిగిలితే కూలోళ్లకు ఇస్తున్నం. మాకు నీళ్లిచ్చిండు, మంచి కరెంటిచ్చిండు. పెట్టువడి సుతం పైసలు ఇస్తున్నడు. రందిలేకుండా ఎవుసం చేసేతానికి ఇంతకన్నా ఏంగావాలే. ఇసొంటి సీఎం సారే ఎప్పటికి ఉండాలే. చానా సంతోషంగా ఉన్నది.
-పెంతల లక్ష్మణ్-పద్మ, దుర్శేడ్, కరీంనగర్ జిల్లా
రైతుబంధు పైసలతో నాట్లేయిస్త
కేసీఆర్ సారు రైతుబంధు ఆలోచన మంచిగుంది. అప్పట్ల ఇసోంటి పరిస్థితి ఉండేదిగాదు. పసలు మొదలైందంటే ఏ షావుకారి కాడికోపోయి వడ్డీ పైకం తెచ్చుకునేటోళ్లం. ఎకురం, అరెకురం ఉన్న చిన్న సన్నకారు రైతులైతే అరిగోస పడేటోళ్లు. లాగోడి ఎల్లక ఎవుసం బంద్ జేసుకున్నోళ్లు గూడా ఉన్నరు. అప్పట్ల సర్కార్లు ఆదుకోకపోవడంతో సానా మంది నా తోటోళ్లు పెట్టుబడి ఎల్లక సచ్చిపోయిండ్రు. కేసీఆర్ సారు సీఎం అయినంక లాగోడికి పైసలిస్తున్నడు. నాపేరిట అరెకరాల ఎవుసం జాగ ఉంది. నా భార్య అంజమ్మ పేరిట 30 గుంటలున్నది. ఈ దఫా ఆమెకు మొదటి రోజే 2,500 రూపాలు బేంకులో పడ్డయ్. బేంకుకువోయి పైసలు తెచ్చుకొని నాట్లేసిన కూలీలకు ఇస్త.
– చిగుర్ల ఆశాలు, గోపాల్పూర్, కరీంనగర్ జిల్లా
టైంకు పైసలు అందినయి
రైతుబంధు పైసలు టైంకు అందినయి. యాసంగిలో నాట్లు వేస్తున్న సమయంలో రైతుబంధు పైసలు అచ్చుడుతోటి పెట్టుబడి కోసం బాధ తప్పింది. ఇప్పుడు అచ్చిన పైసలు ఎరువులు, పొలం దమ్ము చేసి ట్రాక్టర్, కూలీలకు సరిపోతాయి. నాకు ఇప్పటిదాకా పదిమార్లు పంట పెట్టుబడి పైసలు అచ్చినయ్. పైసల కోసం వ్యాపారుల దగ్గరికి పోయే బాధ తప్పింది. పెట్టుబడి పైసలు ఇచ్చుడే కాకుండా పండిన పంటలను కొనుగోలు చేస్తున్న కేసీఆర్ సార్ను రైతులు ఎప్పటికీ మరచిపోరు. రైతుబంధు, రైతుబీమాతోపాటు, ఉచిత కరెంటు అందిస్తూ మమ్ముల్ని ఆదుకుంటున్నడు.
-కేతావత్ విష్ణు, సోమారం తండా, గాంధారి మండలం, కామారెడ్డి జిల్లా
ఎవుసంపై ఆసక్తి పెరిగింది
హైదరాబాద్కు పోయి ఎదైనా జాబ్ చూసుకుందామనుకున్న. వ్యవసాయంలో మావోళ్లు పడ్డ కష్టాలు చూసి నాకు ఆ పరిస్థితి రావొద్దు అనుకున్న. పంట వేసే ప్రతిసారి మా నాన్న అప్పుల కోసం తిరిగేది. పండిన పంట వడ్డీకే సరిపోయేది. గది చూసి నేను వ్యవసాయం జోలికి వెళ్లొద్దనుకున్న. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన రైతుబంధు పథకంతోటి వ్యవసాయం చేయాలనే ఆసక్తి పెరిగింది. హైదరాబాద్కు పోవదామనుకునే ఆలోచన విరమించుకున్న. వ్యవసాయానికి 24 కరంటు అందుతున్నది. రైతుబంధు డబ్బులు విత్తనాలు, ఎరువులు, పెట్టుబడికి ఉపయోగపడుతున్నయి. టైంకు పెట్టుబడి సాయం ఇయ్యడం మామూలు విషయం కాదు. కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
-బోయిని వినోద్, ధర్మారం, భీమదేవరపల్లి మండలం
అప్పట్లాగా అప్పులు తెస్తలేదు
నాకు నాలుగు ఎకరాలు ఉన్నది. రూ.20 వేల రైతుబంధు పైసలు పడ్డాయి. నాటు కూళ్లు ఇవ్వగా, మిగిలినవి ఎరువులు కొన్నా. అప్పట్లాగా షావుకార్ల దగ్గరకు పోతలేం. అప్పులు తెచ్చుకుంటలేం. సీఎం కేసీఆర్ సారు అందిస్తున్న పెట్టుబడి సాయంతో కష్టాలు తీరినయి. పండిన వడ్లు ఎంబడే కొంటున్రు. అకౌంట్లలో పైసలు పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక అప్పులకు పోతలేం. శానా బాగుంది. రైతుబంధు అండగా నిలిచింది. కరెంట్ ఉచితంగా ఇస్తున్రు. బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉండుంది. వ్యవసాయం బాగా చేసుకుంటున్నం. పెట్టుబడి సాయం ఇచ్చినకాంచి ఖర్చులు ఎల్లుతున్నయి. ఎకరాకు ఐదువేలు సర్కార్ ఇస్తుండడంతో పెట్టుబడి కోసం అప్పులు తేవట్లే.
-సత్యనారాయణ, గోప్లాపూర్, భూత్పూర్ మండలం, మహబూబ్నగర్ జిల్లా