న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): విశాఖ స్టీల్ప్లాంట్ బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటే స్వాగతిస్తామని సీపీఐ నేత కే నారాయణ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న 30 వేల ఎకరాల భూమి కోసమే అదానీ వస్తున్నాడని ఆరోపించారు.
ప్లాంట్ను స్క్రాప్ కింద అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదానీకి అప్పగిస్తే ప్లాంట్ను డంపింగ్ యార్డు కింద మార్చుకుంటాడని పేర్కొన్నారు. ఎయిర్పోర్టు, పోర్టులకు సమీపంలో 30 వేల ఎకరాల భూమి ఎక్కడా దొరకదని చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్రానికి బానిసగా మారిపోయాడని విమర్శించారు. విశాఖ ప్లాంట్ను ఏపీ ప్రభుత్వం తీసుకునేందుకు ముందుకొస్తే మరుసటి రోజే జగన్ను జైల్లో పెడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీపీఐ గుర్తింపును రద్దు చేయడం ఎన్నికల కమిషన్ తీసుకున్న దుర్మార్గపు చర్య అని నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని వల్ల తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. దేశంలోని 20 రాష్ర్టాల్లో సీపీఐ ఉన్నదని, పార్టీకి ఐదారు లక్షల సభ్యత్వాలు, ప్రజాసంఘాలకు మరో 2 కోట్ల సభ్యత్వాలు ఉన్నాయని వివరించారు. సాంకేతికపరమైన కారణాలను చూపి పార్టీ గుర్తింపును రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈసీ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ దివాలాకోరుతనం బయటపడిందని, ఈసీనీ కూడా కేంద్రమే నియంత్రిస్తున్నదని విమర్శించారు.