మణికొండ : రాజశ్యామల(Rajshyamala) అమ్మవారి అనుగ్రహంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి(Telangana Development) సాధిస్తోందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ(Swaroopanandendra Saraswathi) స్వామి అన్నారు. నగర శివారు ప్రాంతంలోని కోకాపేటలో విశాఖ శారదా పీఠం చేపట్టిన రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆదివారం పీఠాధితులు స్వాత్మానందేంద్ర స్వామితో కలిసి శంకుస్థాపన చేశారు.
స్వరూపానందేంద్ర స్వామిజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కరెంటు కోతలు, నీటి కొరత తెలంగాణను వెంటాడుతాయని అంతా భావించారని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాజశ్యామల అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఎన్నో సమస్యలను అధిగమించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాజశ్యామల అమ్మవారు ఆవిర్భవించాలనే సదుద్దేశంతో తమ పీఠానికి రెండెకరాల స్థలాన్ని కేటాయించారని వెల్లడించారు. విశాఖ శారదాపీఠానికి ఆర్థిక వనరులు లేకపోయినా రాజశ్యామల ఉపాసనాబలంతో ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపడతోందని వివరించారు.
రాజశ్యామల ఆరాధనతో మాజీ ప్రధాని పీవీ(Ex Prime Minister PV)తో సహ ఎంతోమంది గొప్పవారయ్యారని గుర్తుచేశారు. తెలంగాణలో రాజశ్యామల ఆలయ నిర్మాణానికి కొందరు ప్రముఖులు ముందు కొచ్చారని అయితే భక్తుల భాగస్వామ్యంతోనే ఆలయ నిర్మాణం పూర్తి కావాలని భావించానని స్పష్టంచేశారు. అమ్మవారు ఏ ఒక్కరి సొత్తూ కాదని చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యే సతీష్కుమార్,రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కంపెనీస్ లా ట్రిబ్యునల్ న్యాయమూర్తి బద్రీనాథ్ దంపతులు,ఫొన్సిక్స్ ప్రతినిధి చుక్కపల్లి సురేష్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
,