హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అయిన ఫార్మాసిటీని త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అవసరమైన అన్ని అనుమతులను ఫార్మా సిటీ పొందిందని తెలిపారు. ఈ ఫార్మాసిటీ పనులు 19 వేల ఎకరాల్లో శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన సీఐఐ సదరన్ రీజినల్ కౌన్సిల్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ అన్ని రంగాల్లో వేగంగా పురోగతిని సాధించిందని స్పష్టం చేశారు. భారతదేశాన్ని వృద్ధి పథంలో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ రెండేండ్ల క్రితం దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులను పిలిపించి మాట్లాడారు. అప్పుడు తాము 3ఐ సూత్రాన్ని సూచించామని గుర్తు చేశారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూసివిటీని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. దీని వల్ల ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
టీఎస్ ఐపాస్ అమలు చేసిన తర్వాత పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయని చెప్పారు. పరిశ్రమలకు సింగిల్ విండో విధానాన్ని ప్రకటించి, 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రానికి సుమారు రూ. 2.83 లక్షల కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 16 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించామన్నారు. అతి పెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్, అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ టీ వర్క్స్కు తెలంగాణ నిలయంగా ఉందన్నారు కేటీఆర్.