హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): అద్వితీయ ప్రగతికి తెలంగాణ రాష్ట్రం అద్దం పడుతున్నదని ముఖ్యమత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. 75 ఏండ్ల స్వాతంత్ర భారతం సాధించని ప్రగతిని, కేవలం 8 ఏండ్లలోనే తెలంగాణ సాధించి చూపిందని, దేశానికి మార్గదర్శనం చేసే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్లోని పబ్లిక్గార్డెన్స్లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి సందేశమిచ్చారు. అస్తిత్వం కోసం ఆరు దశాబ్దాలు పోరాడిన తెలంగాణ, నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, వివిధ రంగాల్లో వచ్చిన గుణాత్మక మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై సీఎం సవివరమైన సందేశమిచ్చారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో 17.24 శాతం ఆర్థిక వృద్ధిరేటు సాధించాం. ఆర్థిక వృద్ధిరేటు విషయంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా, కరోనావంటి విపత్తులు వచ్చినా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. కరోనా సంక్షోభం నుంచి అతి త్వరగా తెలంగాణ కోలుకొన్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ దక్షతకు దకిన గుర్తింపు. 2013-14లో తెలంగాణ జీఎస్డీపీ రూ. 5,05,849 కోట్లు. 2021-22 నాటికి రూ. 11, 54,860 కోట్లకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఖర్చుచేస్తున్నది. తలసరి ఆదాయం పెరుగుదలలో తెలంగాణ రికార్డు సృష్టించింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104 ఉండగా, 2021-22 నాటికి రూ.2,78,833 పెరిగింది. జాతీ య సగటు ఆదాయంకన్నా రాష్ట్రంలో 86% అధికం.
తెలంగాణ కరెంటు కష్టాలకు చరమగీతం పాడింది. రాష్ట్రంలోని అన్ని రంగాలకూ ప్రభుత్వం నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నది. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పడానికి గర్విస్తున్నా. రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్ర స్థాపిత విద్యుత్తు సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు. ప్రభుత్వ కృషి ఫలితంగా ఇవ్వాళ రాష్ట్రంలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 17,305 మెగావాట్లు. సోలార్ విద్యుదుత్పత్తిలో రాష్ట్రం గత ఎనిమిదేండ్లలో 74 మెగావాట్ల నుంచి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది. తలసరి విద్యుత్తు వినియోగంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. 2014లో రాష్ట్ర తలసరి విద్యుత్తు వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు చేరింది. జాతీయ సగటుతో పోలిస్తే మన తలసరి విద్యుత్తు వినియోగం 73 శాతం ఎక్కువ.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ తాగునీటి కోసం తల్లడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాగునీటి సమస్య పరిషారానికి మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. దీంతో ఇవ్వాళ రాష్ట్రంలో 100 శాతం ఆవాసాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షిత తాగునీరు సరఫరా అవుతున్నది. మిషన్ భగీరథ పథకాన్ని ఎందరో ప్రశంసించారు. ఈ పథకానికి నేషనల్ వాటర్ మిషన్ అవార్డు వరించింది. మన మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇది మనందరికీ గర్వకారణం.
సమైక్య రాష్ట్రంలో వివక్షాపూరిత విధానాలతో తెలంగాణ వ్యవసాయ రంగం కుదేలైంది. సాగునీరు లేదు. బోర్లపై ఆధారపడదామంటే కరెంటు లేదు. పెట్టుబడి లేదు. అప్పులతో, కుటుంబాన్ని పోషించలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి. అందుకే స్వరాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం అనేక సంసరణలు, పథకాలు తెచ్చాం. నేడు మన రాష్ట్రం ‘సజల సుజల సస్యశ్యామల తెలంగాణ’గా మారింది. రైతురుణ మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, ప్రతీ 5 వేల ఎకరాలను ఒక వ్యవసాయ క్లస్టర్గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించటం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతుబంధు సమితుల ఏర్పాటు, రైతుబంధు, రైతు బీమా, భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నీటి తీరువా బకాయిల రద్దు తదితర పథకాలు, కార్యక్రమాలతో నేడు వ్యవసాయం దండగ కాదు, పండుగ అని నిరూపించాం. స్వతంత్ర భారత చరిత్రలో రూ.50 వేల కోట్లు పంట పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకున్నం. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, చనాకా-కొరాట మొదలైన ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఒక అపూర్వఘట్టం. చైనా వంటి దేశాల్లో మాత్రమే సాధ్యమనుకునే వేగంతో ప్రపంచంలో అతిపెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించుకొన్నాం. రాష్ట్రం ఏర్పడేనాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. 2021 నాటికి 85.89 లక్షల ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం సాగునీటి సౌకర్యం కల్పించింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే ధ్యేయంగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాం. మిషన్ కాకతీయ ద్వారా 15 లక్షలకుపైగా ఎకరాల సాగుభూమిని స్థిరీకరించుకొన్నాం. చెరువులను భారీ ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేయటంతో నేడు నిండు వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకొన్నాయి. చెరువులు అభివృద్ధితో చేపల పెంపకం జోరందుకొని, మత్స్యకారులు పెద్దఎత్తున లబ్ధి పొందుతున్నారు.
రాష్ట్రంలో గూడులేని నిరుపేదలకు సొంత ఇంటి కలను తీర్చడమే కాకుండా గౌరవ ప్రదమైన నివాసాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. దేశంలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తిగా ఉచితంగా నిర్మించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వం ఇప్పటివరకు 2 లక్షల 91 వేల ఇండ్లు మంజూరు చేసింది. ఇందుకోసం రూ. 19,126 కోట్లు కేటాయించింది. అలాగే సొంత స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూం నిర్మాణానికి దశలవారీగా రూ. 3 లక్షలు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇది నిరంతర ప్రక్రియ.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ వికాసం కోసమే ధ్యేయంగా మొదటిదశలో గురుకుల విద్యకు ప్రాధాన్యం ఇచ్చింది. దేశంలో అత్యధికంగా 978 గురుకుల విద్యాలయాలు ఉన్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా విద్యార్థులకు సమగ్ర శిక్షణనిస్తూ గురుకులాలు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ అనే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికింది. రూ.7,289 కోట్ల వ్యయంతో దశలవారీగా అన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడతున్నది. మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్ల వ్యయంతో కార్యాచరణ ప్రారంభించింది. ఉన్నత విద్యలో మహిళలు ముందుండాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నది. కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్నీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం కొత్తగా 192 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసింది. మైనారిటీ బాలికల కోసం 50 శాతం గురుకులాలను కేటాయించటంతో మైనారిటీ బాలికల ఎన్రోల్మెంట్ గతంలో 18 శాతంగా ఉంటే, ఇప్పుడు 42 శాతానికి పెరిగింది.
హైదరాబాద్ నగరవాసులతోపాటు సరిహద్దు జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రాజధాని నగరం నలువైపులా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లను అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటుచేస్తున్నాం. రూ. 2,679 కోట్ల వ్యయంతో అల్వాల్, ఎల్బీ నగర్, సనత్నగర్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ప్రభుత్వం నిర్మిస్తున్నది. గచ్చిబౌలీలో టిమ్స్ ఇప్పటికే సేవలందిస్తున్నది. ఒకో దవాఖానలో వెయ్యి పడకలు ఉంటాయి. నిమ్స్లో మరో రెండువేల పడకలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిమ్స్లో మొత్తం 3,489 పడకలు అందుబాటులోకి వస్తాయి.
వరంగల్లో హెల్త్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వరంగల్ నగరంలో అధునాతన వసతులతో 2 వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వైద్యం కోసం వచ్చి ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణిస్తే, మృతదేహాన్ని ప్రభుత్వ అంబులెన్సులో ఇంటివద్దకు చేర్చేందుకు ప్రభుత్వం పరమపద వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనూ ఎకడా లేదు. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న మొదటి మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి కావడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ప్రబల నిదర్శనం. వచ్చే రెండేండ్లలో ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ సేవలందిస్తుంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, డయాగ్నస్టిక్ కేంద్రాల వివరాలు, పరీక్షల వివరాలు మొబైల్ ఫోన్లలో చూసుకొనేలా దేశంలోనే మొదటిసారి తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.
సమైక్యపాలనలో ధ్వంసమైన వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక ప్రేరణనిచ్చి ఆదుకొంటున్నది. మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నది. రిజర్వాయర్లు, చెరువులు జలకళ సంతరించుకోవటంతో మత్స్య సంపద పెరిగి, మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో 8 ఏండ్లలో రూ. 25.782 కోట్ల మత్స్య సంపద సృష్టించబడింది. గొల్ల కుర్మల సంక్షేమం కోసం చేపట్టిన గొర్రెల పంపిణీ సత్ఫలితాలిచ్చింది. మాంసం ఉత్పత్తిలో తెలంగాణ స్వావలంబన సాధించింది. ఇప్పుడు రాష్ట్రం గొర్రెల పెంపకంలో నంబర్-1గా నిలిచింది. గౌడ సోదరుల సంక్షే మం కోసం తాటి చెట్లపై పన్ను బకాయిలు మాఫీ చేయడమే కాకుండా, శాశ్వతంగా చెట్ల పన్ను రద్దు చేసింది. మరణించిన లేదా అంగవైకల్యానికి గురైన గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం రూ.50 వేల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్ కల్పి స్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నది. దోబీఘాట్లకు, లాండ్రీలకు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ పనిని అప్పగించటంతోపాటు నూలు, రసాయనాలపై 50%సబ్సిడీ ఇస్తున్నది.
రాష్ట్ర అవతరణ అనంతరం పరిపాలన అవసరాలకు తగినట్టుగా ప్రభుత్వం వివిధ సంసరణలు చేపట్టింది. భూ రికార్డులు ప్రక్షాళనచేసి, రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించింది. భూ రికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్ తెచ్చింది. భూ పరిపాలనలో ధరణి నవశకానికి నాంది పలికింది. రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడంతోపాటు కొత్త డివిజన్లు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకొన్నాం. ‘మా గూడెంలో మా పాలన – మా తండాలో మా పాలన’ అనే ఎస్టీల చిరకాల వాంఛను సాకారం చేస్తూ రాష్ట్రంలోని అన్ని గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,146 మంది గిరిజనులు కొత్తగా సర్పంచులయ్యారు. 30 జిల్లాల్లో అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్లను నిర్మిస్తున్నాం. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎమ్మెల్యేల కోసం క్యాంపు కార్యాలయాలు నిర్మించాం. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించేలా నూతన సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్నాం.
పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిటైన యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత రమ్యంగా, వైభవంగా పునర్నిర్మించాం. వెయ్యెకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి టెంపుల్ సిటీ నిర్మాణం పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇతర పుణ్యక్షేత్రాలను కూడా ఇలాగే తీర్చిదిద్దుకొందాం. భారీ జలాశయాలను అద్భుతంగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని పెంచుతున్నాం. కాళేశ్వరం సర్యూట్ టూరిజం అభివృద్ధికి బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించాం.
ఉద్యమంలో భాగస్వామ్యాన్ని పంచుకున్న ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 43% ఫిట్మెంట్ అందించింది. కరోనా కష్టాలు వెంటాడుతున్నా కొత్త పీఆర్సీలో 30% ఫిట్మెంట్ ప్రకటించి అమలుచేస్తున్నది. నేడు తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనం పొందుతున్నారు.
సమైక్య రాష్ట్రంలో ధ్వంసమైన తెలంగాణను బాగుచేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కష్టపడుతున్నది. పంచాయతీలకు ప్రతి నెల రూ. 256.66 కోట్లు విడుదల చేస్తున్నది. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ అందించి, డంప్యార్డు, అంత్యక్రియలకు వైకుంఠధామాలను ఏర్పాటుచేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. మన గ్రామాలు.. గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తున్నది. రెండు పర్యాయాలు కేంద్రం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపికవటం గర్వకారణం. మరో దఫా పల్లెప్రగతి, పట్టణ ప్రగతి శుక్రవారం నుంచే మొదలుకానున్నాయి. ప్రతి గ్రామంలో ‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. టీఎస్ఐపాస్, నిరంతర విద్యుత్తు, శాంతిభద్రతలు, సుస్థిర ప్రభుత్వం, పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఎనిమిదేండ్లలో రూ.2,32,111 కోట్ల పెట్టుబడులు, 16,48,956 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ రంగంలో 1,500కు పైగా పరిశ్రమలు హైదరాబాద్లో ఏర్పాటయ్యాయి. ప్రపంచ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, అమెజాన్ వంటి అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.1,83,569 కోట్లకు చేరుకొన్నాయి. సుపరిపాలన సూచీలో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఎనిమిదేండ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో కలిపి 24 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగింది.
తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మన నిధులు మనకే దకుతున్నాయి. రాష్ట్రం అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులు నిర్మించుకొంటున్నాం. ఎనిమిదేండ్లలో 1.33 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం. ప్రస్తుతం మరో 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీచేస్తున్నాం. 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాం. ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను కొత్తవారితో భర్తీ చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 2,24,142 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేయటం ద్వారా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే 95 శాతం దక్కేలా రాజ్యాంగంలో ఆర్టికల్ 371-డీ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను రాష్ట్ర ప్రభుత్వం సాధించింది.
దళితజాతి అభ్యున్నతే ధ్యేయంగా మరే రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా అమలు చేస్తున్నాం. దళితులను ఆర్థికంగా బలోపేతంచేసి, సామాజిక వివక్ష నుంచి విముక్తి కలిగించాలనేదే ప్రభుత్వ సంకల్పం. ఆ లక్ష్య సాధనకోసం నేనే స్వయంగా దళితబంధుకు రూపకల్పన చేశాను. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇది రుణం కాదు. తిరిగి చెల్లించే పనిలేదు. ఏ విషయంలోనూ లబ్ధిదారునిపై ఆంక్షలు విధించకపోవటమే ఈ పథకం గొప్పతనం. దళితబంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దళితబంధుతోనే ‘దళిత రక్షణ నిధి’ కూడా ఏర్పాటు చేశాం. దళితులు వివిధ వ్యాపారాల్లో ఎదిగేందుకు మెడికల్, ఫెర్టిలైజర్, వైన్ షాపులు, హాస్టళ్లు, దవాఖానలకు సరఫరా చేసే వివిధ రకాల వస్తువులు కాంట్రాక్టుల్లో ప్రభుత్వం దళితులకు పదిశాతం రిజర్వేషన్ అమలుచేస్తున్నది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయిన 2,616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది. రాష్ట్రంలోని దళితులందరికీ దశలవారీగా దళితబంధును ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఏడాది దళితబంధు కోసం బడ్జెట్లో రూ.17,700 కోట్ల కేటాయించింది. మహోన్నత ఆశయంతో అందిస్తున్న ఈ పథకాన్ని దళితులంతా సద్వినియోగం చేసుకోవాలి.
తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషిచేస్తున్నది. ప్రజావైద్యం, ఆరోగ్య రంగాలలో గుణాత్మక పురోగతి సాధిస్తున్నాం. 57 వైద్య పరీక్షలు ఉచితంగా చేసేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం 42 ఉచిత డయాలసిస్ సెంటర్లను ప్రారంభించాం. దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా ప్రభుత్వం రాష్ట్రంలోని దవాఖానల్లో అన్ని బెడ్స్ను ఆక్సిజన్ బెడ్స్గా మార్చింది. రాష్ట్రంలో 56 వేల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. నేడు ప్రభుత్వ దవాఖానల్లో మోకీలు మార్పిడి ఆపరేషన్లు సైతం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5 కే భోజనం అందిస్తున్నాం. గర్భిణిలను దవాఖానలకు తీసుకురావటం, ప్రసవానంతరం తిరిగి ఇంటికి చేర్చడం కోసం 300 అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. కేసీఆర్ కిట్ పథకం సత్ఫలితాలనిచ్చింది. దీని ద్వారా ఇప్పటివరకు 13.30 లక్షల మందికి లబ్ధి చేకూరింది. కేసీఆర్ కిట్తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 నుంచి 56 శాతానికి పెరిగాయి. హైదరాబాద్ బస్తీల్లో నివసించే పేదలకు వైద్యసేవల కోసం ప్రభుత్వం 350 బస్తీ దవాఖానలను మంజూరు చేసింది. ఇప్పటికే 256 సేవలందిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీ దవాఖానలు ప్రారంభించబోతున్నాం. గ్రామాల్లో ప్రాథమిక వైద్య సేవలను అందించేందుకు పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం.
తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతిపై ఇటీవల కొన్ని జాతీయ మీడియా సంస్థలు కార్యక్రమాలు ప్రసారం చేశాయి. అది చూసిన ఇతర రాష్ట్రాలవారు ఇంత తకువ కాలంలో ఇంతటి అభివృద్ధి ఎలా సాధ్యమైందని ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. మనం అనతికాలంలోనే అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించేందుకు సహకరించిన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నాను. అనతి కాలంలోనే తెలంగాణలో అద్భుతమైన సంపద సృష్టించబడింది. రాష్ట్రంలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయి. మరే రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. రాష్ట్రంలో నేడు ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. వృద్ధాప్య పెన్షన్ను మరింత మంది నిస్సహాయులకు అందించేందుకు అర్హత వయసును 57 ఏండ్లకు తగ్గించాం. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టినం. ఈ పథకం ద్వారా 11,44,000 మంది ఆడపిల్లల పెండ్లికి ఆర్థిక సహాయం అందింది. ఇవేవీ ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు కావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు.. ఎనిమిదేండ్ల చిరు ప్రాయంలో రాష్ట్రం సాధించిన విజయాల్లో ఇవి కొన్ని మాత్రమే’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.