తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు చాలా మేరకు తగ్గాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి.
-నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర మంత్రి
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్న దుష్ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. గతంతో పోలిస్తే తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు చాలా మేరకు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. ఎంపీ నారాయణ్దాస్ గుప్తా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గినట్టు వెల్లడించారు. 2017లో 846 మంది, 2018లో 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ సంఖ్య 2019లో 491కి, 2020లో 466కు, 2021లో 352కు తగ్గినట్టు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతుబంధును అమలు చేయడంతోపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, సమృద్ధిగా సాగునీరు అందిస్తుండటంతో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగినట్టు విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించి, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాయి. తద్వారా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇతర రాష్ర్టాల్లోనే అధికం
వాస్తవానికి తెలంగాణ కంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి బీజేపీ పాలిత మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో 2020లో 2,567 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2021లో ఈ సంఖ్య 2,640కు పెరిగింది. ఈ జాబితాలో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 2020లో 1,072 మంది, 2021లో 1,170 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
2017లో దేశవ్యాప్తంగా 5,955 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. 2021లో ఈ సంఖ్య 5,318కు తగ్గింది. అంటే ఐదేండ్లలో తగ్గిన ఆత్మహత్యలు 637 మాత్రమే. అన్నదాతల ఆత్మహత్యలను నిరోధించడంలో తెలంగాణ అన్ని రాష్ర్టాల కంటే ముందు వరుసలో ఉన్నది. 2017లో దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నుంచి 15% ఉండగా.. 2021లో ఇది 6.61 శాతానికి తగ్గింది. కానీ, ఇదే సమయంలో ఈ ఆత్మహత్యల రేటు మహారాష్ట్రంలో 40.73 నుంచి 49.64 శాతానికి, కర్ణాటకలో 19.42 నుంచి 22 శాతానికి పెరిగింది.