కలలుగన్న తెలంగాణ సాకారమైంది. పెద్ద రాష్ర్టాలకు దీటుగా తెలంగాణ ప్రగతి సాధిస్తున్నది. 8 ఏండ్ల క్రితం రూ.1.24 లక్షలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం ఇప్పుడు రూ.2.75 లక్షలకు చేరింది. కేంద్రం ఎన్ని ఆర్థిక ఆంక్షలు పెట్టినా రికార్డు స్థాయి వృద్ధితో దూసుకుపోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియకముందే 19-20శాతం వృద్ధిని సాధించి తెలంగాణ సరికొత్త మైలురాయిని దాటింది.
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి తొలివారంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్టు తెలిసింది. వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్ను మార్చి మొదటివారంలో ప్రవేశపెడుతుంటారు. అయితే సీఎం కేసీఆర్ కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాలపై సీరియస్గా దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత వేగం మరింత పెరిగింది. ముఖ్యంగా ఖమ్మం సభతో దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ గురించి, తెలంగాణ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మూడు రాష్ర్టాల సీఎంలు, ఇద్దరు జాతీయ పార్టీల కీలక నేతలు హాజరుకావడంతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి.
అనేక రాష్ర్టాలు తెలంగాణ అభివృద్ధిని పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో మరింత వేగం, చొరవ పెరగాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకోసం తెలంగాణ బడ్జెట్ను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతుంది. ఇందులో రాష్ర్టానికి సంబంధించి తేలాల్సిన లెక్కలు రెండు మాత్రమే ఉంటాయి. ఎఫ్ఆర్బీఎం రూపంలో రాష్ర్టానికి వచ్చేది ఎంత? కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు వాటా (డివొల్యుషన్-స్టేట్స్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్) ఎంత వస్తుంది? అన్న రెండు అంశాలు తెలిస్తే సరిపోతుంది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టగానే రాష్ర్టానికి వచ్చే నిధులపై అధికారులు ఒక అంచనాకు వస్తారు. ఈ మేరకు ఈ వారంలో కసరత్తు పూర్తి చేసి, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన కొద్దిరోజుల్లోనే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
నేడు సీఎం సమీక్ష!
గత 10 రోజులుగా రాష్ట్ర బడ్జెట్పై భారీ స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. అన్ని శాఖలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలని ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధులు, వాటి వినియోగం, వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రతిపాదనలు నిర్ణీత ఫార్మాట్లో పంపించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా ఆన్లైన్లో పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు దాదాపు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినట్టు తెలిసింది. వీటి ఆధారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కొన్ని రోజులుగా 2023-24 బడ్జెట్పై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు కొన్ని రోజులు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చారు. దీంతో బడ్జెట్ తయారీపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్టు సమాచారం. బడ్జెట్పై సీఎం కేసీఆర్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నదని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరవుతున్నట్టు తెలిసింది.
రూ.3 లక్షల కోట్ల వరకు బడ్జెట్?
2022-23లో ప్రభుత్వ వ్యయం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు దాటినట్టు అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నాయి. అవి కూడా కలుపుకొంటే రూ.2.10 లక్షల కోట్ల నుంచి రూ.2.15 లక్షల కోట్ల వరకు లెక్క తేలుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర సొంత ఆదాయ (స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ) వృద్ధిలో తెలంగాణ దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించినట్టు సమాచారం. రాష్ట్ర సొంత ఆదాయం (ఎస్వోఆర్) 19-20 శాతం వృద్ధి నమోదు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎస్వోఆర్ అంటే రాష్ర్టానికి వచ్చే పన్ను, పన్నేతర ఆదాయం.
దేశ చరిత్రలోనే ఇంత వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం మరోకటి లేదని ఆర్థిక నిపుణలు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఆర్థికంగా ఆంక్షలు పెట్టింది. కేంద్రం చర్యలతో రాష్ర్టానికి రావాల్సిన రూ.15 వేల కోట్ల వరకు నష్టపోయామని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయినా రాష్ట్ర ఆదాయ వృద్ధి మాత్రం ఎక్కడా తగ్గలేదని నిపుణులు పేర్కొంటున్నారు. సొంత ఆదాయంలో రికార్డు వృద్ధి సాధించి దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని అభినందిస్తున్నారు. ఆదాయ వృద్ధి ద్వారా తెలంగాణ తాను బతుకుతూ.. దేశాన్ని బతికించిందని ప్రశంసిస్తున్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ‘తాను పెరుగుతూ.. దేశ జీడీపీ పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తున్నది’ అని కొనియాడుతున్నారు. దశాబ్దాల కింద ఏర్పడి, వైశాల్యంలో, ఆర్థికంగా పోల్చినా దేశంలోని ఇతర పెద్ద రాష్ర్టాలతో పోటీ పడి తెలంగాణ అగ్రస్థానానికి చేరడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు.
తెలంగాణ ముఖం తెల్లవడ్డది
ఎనిమిదన్నరేండ్ల ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 2014లో మొదలైన తెలంగాణ ప్రగతి పరుగులు నేటి వరకు కొత్త శిఖరాలకు చేరుతూనే ఉన్నాయి. కరెంటు కోతలు లేకుండా పోయాయి. కాళేశ్వర జలాలతో రాష్ట్రం కళకళలాడుతున్నది. పెట్టుబడులు తరలివస్తున్నాయి. వలసలు ఆగి, వేరే రాష్ర్టాల నుంచి ఇక్కడికి పెరిగాయి. సమర్థుడైన సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంపదనను పెంచుతూ.. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచుతున్నది. ప్రభుత్వ పథకాలు, చర్యల ఫలితంగా రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. 2014లో రూ.1.24 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం 2022 నాటికి రూ.2.75 లక్షలకు పెరిగింది. తద్వారా సొంత ఆదాయంలో గణనీయ వృద్ధి సాధించింది. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ ముఖం తెల్లవడ్డది. పల్లె ముఖం మీద చిరునవ్వు కనబడుతున్నది.
‘ఇది కదా నేను కలలుగన్న తెలంగాణ. ఉమ్మడి పాలనలో అణచివేతకు గురైన నా తెలంగాణ.. స్వరాష్ట్రంలో ఏ స్థానంలో ఉండాలనుకున్నానో అది నెరవేరింది. దశాబ్దాలపాటు దోపిడీకి గురైన నా తెలంగాణ ప్రజలను ఎలా చూడాలనుకున్నానో అది సాకారం అయ్యింది’ అని సన్నిహితులతో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రజలు కేవలం ఎనిమిదన్నరేండ్లలో చూసిన అభివృద్ధి, అందుకున్న ఫలాలు దేశ ప్రజలకు సైతం చేరువ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దశాబ్దాల పాటు అసమర్థ పాలకుల చేతిలో కునారిల్లిన దేశం.. మోదీ హయాంలో అధఃపాతాళానికి పడిపోవడంతో సీఎం కేసీఆర్ కలత చెందుతున్నారు. ప్రజలు గెలవాలని తాను తండ్లాడుతుంటే.. తమ స్వార్థ రాజకీయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న బీజేపీని చూసి బాధపడుతున్నారు. ‘రాజకీయాల్లో పార్టీలు గెలువొద్దు.. ప్రజలు గెలువాలె’ అనే నినాదంతో ప్రత్యామ్నాయ ఎజెండాను దేశం ముందు ఉంచుతున్నారు. ఈ ప్రయత్నాన్ని మరింత వేగవంతం చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ముందుగా ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.