మన తలసరి ఆదాయం రూ.2,37,632
హైదరాబాద్, ఫిబ్రవరి 23: గత ఐదేండ్లలో (2015-16 నుంచి 2019-20) తలసరి ఆదాయ (ప్రస్తుత రేట్ల ప్రకారం) వృద్ధి రేటులో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణదే మొదటి స్థానం. మొత్తంగా తలసరి ఆదాయ వృద్ధి రేటులో సిక్కిం 13.7 శాతంతో మొదటి స్థానంలో నిలువగా, 13.5 శాతంతో రెండోస్థానంలో, మధ్యప్రదేశ్ 13.2 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి.తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ 2021లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గత ఐదేండ్లలో (2015-16 నుంచి 2019-20) స్థిర రేట్ల ప్రకారం తలసరి ఆదాయ వృద్ధిలో 9.29 శాతంతో మిజోరం మొదటి స్థానంలో ఉండగా, 8.91 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
జాతీయ సగటుకంటే రెట్టింపు
తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయంకంటే దాదాపు రెట్టింపు ఉండటం విశేషం. దేశ తలసరి ఆదాయం రూ.1,28,829 ఉండగా, తెలంగాణలో రూ. 2,37,632 ఉన్నది. ప్రస్తుత రేట్ల ప్రకారం 13 శాతానికి మించి వృద్ధి సాధించిన 3 రాష్ర్టాల్లో సిక్కిం తర్వాత తెలంగాణ రెండోస్థానంలో ఉన్నది. స్థిర రేట్ల ప్రకారం చూసినప్పుడు మొదటి స్థానాన్ని సిక్కిం బదులు మిజోరం దక్కించుకోగా తెలంగాణ స్థానం మాత్రం స్థిరంగా ఉన్నది. తలసరి ఆదాయ వృద్ధిరేటులో కూడా తెలంగాణ సత్తా చాటింది. జాతీయ వృద్థిరేటు కంటే తెలంగాణలో 5.8 శాతం ఎక్కువ వృద్ధిరేటు నమోదైంది. తెలంగాణ వృద్ధి రేటు 2020-21లో 1.8 శాతం ఉండగా, జాతీయ వృద్ధిరేటు -4.0 శాతం (మైనస్) ఉన్నది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104 ఉండగా, ఏడేండ్లలో దాదాపు రెట్టింపయ్యింది. ఇదే కాలంలో జాతీయ తలసరి ఆదాయం మైనస్లోకి వెళ్లటం గమనార్హం.
రుణాలు, డిపాజిట్లలో హైదరాబాద్ టాప్
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : డిపాజిట్ల సేకరణ, రుణాల వితరణలో హైదరాబాద్ జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. 2021-22 ప్రథమ త్రైమాసికంలో హైదరాబాద్ జిల్లాలోని 1,202 బ్యాంకులు రూ.3,61,115 కోట్ల డిపాజిట్లు సేకరించగా, రూ.3,49,118 కోట్ల రుణాలు అందించాయి. జిల్లాలో క్రెడిట్-డిపాజిట్ రేషియో 96.7 శాతంగా ఉన్నది. రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ ప్రకారం.. రాష్ట్రంలోని 5,442 బ్యాంకులు రూ.6,11,401 కోట్ల డిపాజిట్లు సేకరించగా, రూ. 1,09,48,614 కోట్ల మేర రుణాలు ఇచ్చాయి. రాష్ట్ర క్రెడిట్-డిపాజిట్ రేషియో 93.1 శాతంగా నమోదైంది. 189.6 శాతం క్రెడిట్-డిపాజిట్ రేషియోతో సూర్యాపేట జిల్లా మొదటిస్థానంలో ఉన్నది. అతి తక్కువ డిపాజిట్లు, రుణాల విషయానికొస్తే, ములుగు జిల్లాలో 26 బ్యాంకుల ద్వారా రూ.935 కోట్ల రుణాలు సేకరించగా రూ.857 కోట్ల రుణాలు అందించారు.