హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు సంస్థల్లో ప్రాంతేతరుల పెత్తనంపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నలుగురు తాత్కాలిక డైరెక్టర్లలో ముగ్గురు ప్రాంతేతరులే ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా ఎంపికచేసిన ఆ ముగ్గురూ జూనియర్లని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఖైరతాబాద్లోని మింట్కాంపౌండ్తోపాటు విద్యుత్తు ఉద్యోగులు ఎక్కడ కలిసినా ప్రాంతేతర ఉద్యోగులను కీలకమైన డైరెక్టర్లుగా నియమించడంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నాడు తెలంగాణ కోసం ప్రాంతేతర ఉద్యోగులకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో విద్యుత్తు ఉద్యోగులు ముందువరసలో ఉన్నారు.
ప్రస్తుతం వారినే తమ పైఅధికారులుగా తెచ్చిపెడితే ఎలా పనిచేయగలమని, ఇది తమ ఆత్మాభిమాన్ని దెబ్బతీసినట్టేనని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ప్రస్తుతం నియమించిన వారి కన్నా తెలంగాణకు చెందిన సీజీఎంలలో చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ జూనియర్లను నియమించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని విద్యుత్తు ఉద్యోగులు డిమాండు చేస్తున్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్న ఏడుగురిని ఇటీవల ప్రభుత్వం తొలగించి, వారిస్థానంలో నలుగురిని తాత్కాలిక పద్ధతిలో నియమించడంతో ఒక్కసారిగా ఉద్యోగుల్లో అసంతృప్తి రగిలింది. వీరి నియామకాన్ని తక్షణమే రద్దు చేసి తెలంగాణ వారిని మాత్రమే డైరెక్టర్లుగా నియమించాలని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులు డిమాండు చేస్తున్నారు. ఇది విద్యుత్తు ఉద్యోగుల ఆత్మగౌరవ సమస్యగా సీఎం రేవంత్రెడ్డి గుర్తించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తెలంగాణ వారికే అవకాశం ఇవ్వాలని, అవసరమైతే నోటిఫికేషన్లో స్వల్ప మార్పులు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.