Free bus for Women | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్రస్థాయి అధికారులతో గురువారం ఆయన వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఈ ప్రయాణ సౌకర్యానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తున్నదని ఎండీ సజ్జనార్ తెలిపారు. దీనిని మరింత సమర్థంగా అమలు చేసేందుకు సాప్ట్వేర్ను అప్డేట్ చేశామని, మెషిన్ల ద్వారా జీరో టికెట్లను సిబ్బంది జారీ చేస్తారని చెప్పారు.
మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు. స్థానికత ధ్రువీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపి, విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని కోరారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ పథకం అమలులో భాగస్వాములైన అధికారులను ఈ సందర్భంగా ఎండీ అభినందించారు. సమావేశంలో ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవీందర్, ఈడీ (ఆపరేషన్స్) మునిశేఖర్, సీటీఎం జీవన్ప్రసాద్, సీఈఐటీ రాజశేఖర్, ఐటీ ఏటీఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.