హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో మూడేండ్లుగా వివాదాల్లో ఉన్న 665 ఎస్టీ బదిలీ వర్కర్ల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. బుధవారం మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎస్టీ సంక్షేమ సంఘం ప్రతినిధులు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లో కలిశారు. తమ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. 2018లో రాత పరీక్షకు హాజరైన 28 వేలమంది గిరిజన యువత ఉద్యోగాల భర్తీకి ఎదురుచూస్తున్నదని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే సింగరేణి యాజమాన్యంతో చర్చిస్తానని కవిత చెప్పారు. సింగరేణి భూ నిర్వాసితులకు కోర్టు ఆదేశాల ప్రకారం ఉద్యోగాలు కల్పించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. దీనిపై టీబీజీకేఎస్ ప్రధానకార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, సంఘం ప్రతినిధులు కవితకు కృతజ్ఞతలు తెలిపారు.