Telangana | హైదరాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తమవుతున్నది. రాష్ట్రంలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. లండన్కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన గ్రీన్ యాపిల్ అవార్డులను వివిధ విభాగాల్లో యాదాద్రి ఆలయం సహా ఐదు నిర్మాణాలు దక్కించుకున్నాయి. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కాగా, ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు రావడం తెలంగాణకు దక్కిన మరో ఘనత. ఈ నెల 16న లండన్లోని జరగనున్న కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ అవార్డులను అందుకుంటారు. అవార్డులకు ఎంపికైన వాటిలో యాదాద్రి ఆలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం, మోజంజాహీ మార్కెట్ ఉన్నాయి. ఇక్కడి భవనాల డిజైన్, ఆర్కిటెక్చర్ ప్రతిభకు ఈ అవార్డులు అద్దం పడుతున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఇప్పటికే వరల్డ్ గ్రీన్సిటీ అవార్డ్(2022), ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్(2021), లివింగ్, ఇన్క్లూజన్ అవార్డ్-స్మార్ట్సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్(2021) వంటి ప్రపంచస్థాయి అవార్డులను సొంతం చేసుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, పునరుద్ధరించిన ఐదు నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకోవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. గ్రీన్ యాపిల్ అవార్డులు అందుకోనుండడం గొప్ప విషయమని అన్నారు. దేశంలోనే తొలిసారి గ్రీన్ యాపిల్ అవార్డులను దక్కించుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం రాష్ట్రంతోపాటు దేశానికీ గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని రాజీలేకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలతో, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా కట్టడాల నిర్మాణం, పునరుద్ధరణ జరుగుతున్నదని వివరించారు. సకల జనుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదని, మనం ఆచరిస్తున్న ప్రగతిదారులను దేశం అనుసరిస్తున్నదన్నారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాజా అవార్డుల నేపథ్యంలో ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, సిబ్బందిని కేసీఆర్ అభినందించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి గ్రీన్ యాపిల్ అవార్డు లభించడంపై దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రాష్ట్రానికి దకిన అపూర్వ గౌరవమని పేర్కొన్నారు. శతాబ్దాల నాటి ఈ ఆలయాన్ని స్వామివారి విగ్రహానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అద్భుతంగా పునర్నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఆలయం పరిసరాల్లో 40 శాతం గ్రీనరీతో విద్యుత్త వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలిగినట్టు చెప్పారు. కేసీఆర్ మార్గనిర్దేశంలో ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన ప్రతిఒకరికి ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు.
1994లో లండన్లో ఏర్పాటైన గ్రీన్ ఆర్గనైజేషన్ ఎటువంటి లాభాపేక్షలేని స్వతంత్ర సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత కార్యక్రమాలను ప్రోత్సహించడంతోపాటు ఇటువంటి విధానాలను పాటిస్తున్న వాటికి సరైన గుర్తింపును ఇస్తుంది. గ్రీన్ యాపిల్ అవార్డుల పేరుతో 2016 నుంచి ప్రతి ఏటా ప్రముఖ సంస్థలు, కౌన్సిళ్లు, కమ్యూనిటీలను గుర్తిస్తూ వాటికి అవార్డులను ప్రదానం చేస్తున్నది. ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్ గ్రీన్ యాపిల్ అవార్డుల కోసం నిర్ధారిత ప్రమాణాలతోపాటు విశాలమైన, సానుకూల ఆకర్షణీయ దృశ్య ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నివాస భవనాల నుంచి కోటల వరకు, మ్యూజియంలు, వంతెనలు, మతపరమైన స్మారక కట్టడాలు, వారసత్వ నిర్మాణాలు తదితర మరెన్నో నిర్మాణాలకు అవార్డులను అందిస్తారు. గతంలో లండన్లోని బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్(బీఏఎఫ్టీఏ), నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్, మలేషియా క్వాంటన్లోని జలన్మహాకోట్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకున్నాయి.
హైదరాబాద్లో పేరున్న కట్టడాల జాబితాలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిది ప్రత్యేకత స్థానం. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45ను మాదాపూర్తో కలుపుతూ 760 మీటర్ల పొడవుతో రూ.184 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మించారు. జర్మన్ టెక్నాలజీతో 8 దేశాల ఇంజినీర్లు 22 నెలల పాటు శ్రమించి దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఒక్కో పైలాన్కు 26 దృఢమైన ఐరన్ కేబుళ్లు వాడారు. కేబుల్ టెక్నాలజీతో దేశంలో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే.
హైదరాబాద్లో అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్విన్ టవర్స్ నిర్మించారు. ట్విన్ టవర్స్లో ఒకటి పూర్తిగా టెక్నాలజీకి సంబంధించినది కాగా, మరోటి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనం. ఈ రెండు టవర్స్ మధ్య సుమారు 40 వేల చదరపు అడుగులతో అత్యాధునిక టెక్నాలజీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉండే సీసీ కెమెరాల దృశ్యాలను నిరంతరం వీక్షించే ఏర్పాటు ఇక్కడ ఉన్నది.
ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన మోజంజాహీ మార్కెట్ హైదరాబాద్కు ఐకానిక్ మార్కెట్గా పేరొందింది. చివరి నిజాం రెండో కుమారుడు ప్రిన్స్ మోజంజా బహదూర్ ఆధ్వర్యంలో 1933-35 మధ్య కాలంలో ఈ మార్కెట్ నిర్మాణం జరిగింది. నేటి మాల్స్ తరహాలో అన్ని సరుకులు ఒకే దగ్గర లభ్యమయ్యేలా 1.77 ఎకరాల విస్తీర్ణంలో 120 దుకాణాలతో త్రికోణాకృతిలో గ్రానైట్ రాళ్లు, ఇనుప దూలాల అమరికతో పటిష్టమైన రాతి కట్టడంగా నిర్మించారు. 85 ఏండ్ల పాటు నిర్విరామంగా సేవలందించిన ఈ మార్కెట్ శిథిలావస్థకు చేరుకోవడంతో రూ. 15 కోట్లతో ఆధునికీకరించారు. మార్కెట్లో స్టేర్ కేస్, సజ్జలు, డోమ్లు డక్టింగ్, సీలింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, లైటింగ్, ఫ్లోరింగ్ తదితర పనులను పూర్తిచేశారు. మార్కెట్లో ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండా మరింత వన్నె తెచ్చింది.
13వ శతాబ్దం నాటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం అత్యద్భుతం. పంచనారసింహస్వామి విగ్రహానికి ఎలాంటి నష్టం జరగకుండా అత్యద్భుతంగా దీనిని పునర్నిర్మించారు. ప్రధానాలయంలోకి గాలి, వెలుతురు సహజసిద్ధంగా వచ్చేలా ఆలయ పరిసరాల్లో 40 శాతం గ్రీనరీతో నిర్మించి విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గించగలిగారు. మూలవర్యులను ముట్టుకోకుండా పూర్తి కృష్ణశిలతో నిర్మించడం, కొండ చుట్టూ పచ్చదనం, విద్యుత్తు వినియోగం, ప్రసాదాల తయారీలపై ఆలయానికి ఇప్పటికే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐటీబీసీ) అవార్డు లభించింది. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక గ్రీన్ యాపిల్ అవార్డు దక్కించుకున్నది.
దేశంలోనే అరుదైన నిర్మాణంగా పేరుగాంచిన సచివాలయ నిర్మాణంలో కాకతీయుల శైలి అడుగడుగునా కనిపిస్తుంది. షాపూర్ జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అత్యున్నత ప్రమాణాలతో దీనిని నిర్మించింది. నిజామాబాద్లోని నీలకంఠేశ్వరస్వామి దేవాలయం, వనపర్తి సంస్థానపు రాజప్రసాదాల్లోని శైలి, గోపురాలు, గుజరాత్ సారంగాపూర్లోని హనుమాన్ దేవాలయ శైలి సచివాలయ డిజైన్కు ప్రేరణ. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్లోని ధోల్పూర్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించారు. 28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగుల విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇంత ఎత్తైన సచివాలయం మరే రాష్ట్రంలోనూ లేదు. దేశంలోని అతిపెద్ద సచివాలయాల్లో ఇదొకటి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నుంచి గోల్డెన్ సర్టిఫికెట్ పొందిన ఏకైక సచివాలయం కూడా ఇదే.
హైదరాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కేబుల్ బ్రిడ్జ్ తదితర నిర్మాణాలు సీఎం దిశానిర్దేశం మేరకే రూపుదిద్దుకున్నాయని ఆయన చెప్పారు. పర్యావరణహితానికి పెద్దపీట వేస్తూ చేపట్టిన ఈ నిర్మాణాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులు రావడం సంతోషకరమన్నారు.