ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీతో రాష్ర్టానికి ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీల క్యూ
ఆటోమొబైల్ హబ్గా జహీరాబాద్
నిమ్జ్ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ వెల్లడి
జహీరాబాద్లో ఈవీ పార్కు ప్రారంభం
రూ.50 కోట్ల పనులకు శంకుస్థాపన
సంగారెడ్డి, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణ మారుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీతో ఈవీ పరిశ్రమలు రాష్ర్టానికి తరలివస్తున్నాయని చెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును కేటీఆర్ ప్రారంభించారు. జీరో 21 ద్వారా ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిక్ బైక్, త్రీవీలర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వచ్చిందని, ఈవీల ఉత్పత్తి, వాడకం పెరుగుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీతో జహీరాబాద్లో ఎంజీ పరిశ్రమ ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేస్తున్నదని వెల్లడించారు. నిమ్జ్కు ట్రైటాన్, వన్మోటో లాంటి ఎలక్ట్రిక్ వాహన తయారీ పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. త్వరలో మహీంద్రా కంపెనీ సైతం ఎలక్ట్రిక్ వాహనాలు, ట్రాక్టర్ల ఉత్పిత్తిని ప్రారంభించనున్నదని వివరించారు. భవిష్యత్తులో ఇతర ఎలక్ట్రిక్ వాహన తయారీ పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెడతాయని అన్నారు. జహీరాబాద్ ఆటోమొబైల్ హబ్గా మారుతున్నదని చెప్పారు. వచ్చే ఆగస్టులో హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించననున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మహీంద్రా కంపెనీలో తయారైన మూడవ లక్ష ట్రాక్టర్ను మంత్రి కేటీఆర్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఇక్కడి పరిశ్రమలో ఆ కంపెనీ 3 లక్షల ట్రాక్టర్లను ఉత్పత్తి చేసింది.
బీజేపీది రాజకీయ ఆపేక్ష
కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అంటూనే రాజకీయాలు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్- బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ను ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం రాజకీయ ఆపేక్షతో బుందేల్ఖండ్కు తరలించిందని విమర్శించారు. హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటైతే మహబూబ్నగర్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాలతోపాటు ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకు లాభమని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదం ఫలవంతం కావాలంటే కేంద్రం పునరాలోచించుకోవాలని సూచించారు. రాజకీయ ఎజెండాలను పక్కనబెట్టి అభివృద్ధిలో పరుగులు పెడుతున్న, ప్రగతిశీల తెలంగాణ రాష్ర్టాన్ని ఆశీర్వదించాలని కోరారు.
50 ఏండ్లలో కాంగ్రెస్ చేసిందేమీలేదు
50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ ఆరోపించారు. జహీరాబాద్ పట్టణంలో రూ.50 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి.. జహీరాబాద్లోని స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఒక్క చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ కోరటం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. నెహ్రూ మొదలుకొని సోనియా వరకు ఐదు తరాలుగా ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని, కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఏ ఒక్క సమస్య ఉండేది కాదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో నెలకొన్న దరిద్రాన్ని తాము శుభ్రం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధ్ది, ప్రజల కోసం సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జహీరాబాద్ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తామని వెల్లడించారు. జహీరాబాద్లో కొత్త విలీనమైన ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.66 కోట్ల నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు. జహీరాబాద్లో ట్యాంక్ బండ్ నిర్మాణానికి నిధులు ఇస్తామని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో ఎంపీలు బీబీ పాటిల్, కేఆర్ సురేశ్రెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్రావు, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్రెడ్డి, యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, కార్మికుల సంక్షేమ చైర్మన్ దేవేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, ఏపీ ఎంపీ గల్లా జయదేవ్, వెమ్ టెక్నాలజీస్ చైర్మన్ వెంకటరాజు, పద్మజా గ్రీన్ టెక్ సీఈవో అమిత్రెడ్డి, మహీంద్రా ప్లాంట్ హెడ్ రాయ్, ఎంజీ గ్రూప్ ఎండీ అమిత్ కామత్ తదితరులు పాల్గొన్నారు.
మా సర్కారు రైతుల పొట్ట కొట్టదు
తెలంగాణ ప్రభుత్వం రైతుల పొట్టే ప్రభుత్వం కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జహీరాబాద్ నిమ్జ్లో భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని తెలిపారు. రైతులకు మెరుగైన పరిహారం అందజేస్తామని, వారి కుటుంబాల్లోని యువకులకు నిమ్జ్లో ఉద్యోగాలు వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. జహీరాబాద్లోని స్థానిక యువతకు ఉపాధి లభించేలా జహీరాబాద్లో ‘అబ్దుల్ కలాం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఐటీఐ, పదో తరగతి చదవిన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి నిమ్జ్, మహీంద్రా, ఈవీ పార్కుతోపాటు ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించేలా చూస్తామని వెల్లడించారు. నిమ్జ్ నిర్వాసితుల భవిష్యత్తుకు భద్రత ఇచ్చేలా చర్యలు తీసుకొంటామని భరోసా ఇచ్చారు. రైతులకు తగిన పరిహారంతోపాటు అదనపు సహాయం అందేలా చూడాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ను మంత్రి ఆదేశించారు.
నిమ్జ్లో తొలి పరిశ్రమగా వెమ్ టెక్నాలజీస్
అంతకుముందు, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చీలపల్లిలో నిమ్జ్లో ఏర్పాటవుతున్న తొలి పరిశ్రమ వెమ్ టెక్నాలజీ ఇంటిగ్రేడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 12,635 ఎకరాల్లో నిమ్జ్ ఏర్పాటు అవుతున్నదని చెప్పారు. వెమ్ టెక్నాలజీస్కు కోరిన మేరకు భూములు, రాయితీలు ఇచ్చామని, పరిశ్రమ ఏర్పాటు అనంతరం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీని కోరారు. పరిశ్రమకు చుట్టుపక్కన ఉన్న గ్రామాల అభివృద్ధికి చేయూతనివ్వాలని అన్నారు.