నమస్తే తెలంగాణ నెట్వర్క్: కొలువుల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ సహా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలతోపాటు గ్రామాలు, పట్టణాల్లోని నిరుద్యోగ యువత, వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిరుద్యోగులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొన్నారు. ఉద్యోగాలు సాధిస్తామన్న ధీమాతో మురిసిపోయారు. టీఆర్ఎస్ శ్రేణులు వాడవాడలా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించాయి. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు యువత జీవితాంతం రుణపడి ఉంటుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శాసనసభలో బుధవారం ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ నిర్దిష్టమైన ప్రకటన చేసిన అనంతరం గన్పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన శ్రీనివాస్గౌడ్తోపాటు చీఫ్ విప్ వినయ్భాస్కర్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, సైదిరెడ్డి, మెతుకు ఆనంద్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జీవన్రెడ్డి, రవీంద్రకుమార్, భాస్కర్రావు, వివేకానంద, పెద్ది సుదర్శన్రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచుకొన్నారు. తెలంగాణ యువత తరఫున సీఎం కేసీఆర్కు శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఉద్యమ లక్ష్యం నెరవేరుతున్నదని పేర్కొన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో విద్యార్థులు, టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచాయి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్వై, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సంబురాలు జరుపుకొన్నారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
విశాఖలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
తెలంగాణలో భారీ ఉద్యోగ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఏపీ నిరుద్యోగ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు విశాఖపట్నంలో క్షీరాభిషేకం చేశారు. ఏపీలోనూ ఉద్యోగాలు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టా ల్లో దేశ్కీ నేత కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
వయో పరిమితి పెంపుతో ప్రయోజనం
ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల వయో పరిమితి పెంపుతో ఎక్కువమంది నిరుద్యోగులకు ప్రయోజనం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యువకులు ఉద్యోగాల నియామకంలో వివక్షకు గురయ్యారు. అందులో నుంచి వచ్చిందే నీళ్లు-నిధులు-నియామకాలు నినాదం. స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. క్షేత్రస్థాయిలో పాలనావ్యవస్థ మరింత మెరుగవుతుంది.
– పోచారం శ్రీనివాస్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్
మరోసారి రుజువైంది!
మరోసారి రుజువైంది.. ఇచ్చిన హామీలకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగానే నెరవేర్చింది. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2014లో హామీ ఇస్తే, ఇప్పటికే 1,33,942 ఉద్యోగాలను సర్కారు భర్తీ చేసింది. ఇప్పుడు సీఎం కేసీఆర్ 91,142 ఉద్యోగ నియామక బొనాంజాను ప్రకటించారు. 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటమే కాకుండా, 80,039 ఉద్యోగాలను నేరుగా భర్తీ చేస్తాం. ఉద్యోగార్థులకు గుడ్ లక్. – ట్విట్టర్లో ఐటీ మంత్రి కేటీఆర్
ఆకాంక్షల సాధనలో మరో మైలురాయి
భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీ ప్రకటన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల సాధనలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఉద్యమనేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోరికలకు అనుగుణంగా తానిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీచేసి మరో 80,032 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయడం హర్షణీయం.
– తన్నీరు హరీశ్రావు, ఆర్థికశాఖ మంత్రి
మాటకు కట్టుబడే మనిషి కేసీఆర్
కేసీఆర్ మాట ఇస్తే తప్పక అమలు చేస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడే గొప్ప నాయకుడు. దేశంలోనే తొలిసారి 80,039 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించి, 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కొత్తగా వేస్తున్న ఉద్యోగాల్లో 95% స్థానికులకే దకనున్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటన కాంట్రాక్ట్ ఉద్యోగులు, నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగు నింపుతుంది.
– మహమూద్అలీ, హోంశాఖ మంత్రి
ఉద్యమ హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వంగా టీఆర్ఎస్ సర్కారు చరిత్రలో నిలిచిపోతుంది. నూతన ఉద్యోగ నియామకాలతో రాష్ట్రం మరింత అభివృద్ధి పథాన పయనిస్తుంది. ఉద్యోగాలు సాధించాలన్న నిరుద్యోగుల కల సాకారమవుతుంది. యువత సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిఏటా ఖాళీలు భర్తీచేసి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించడం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం.
– అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
చారిత్రాత్మక నిర్ణయం
సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నారు. 80 వేల 39 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడమే కాకుండా కాం ట్రాక్టు ఉద్యోగుల సర్వీస్ను క్రమబద్ధీకరిస్తామని, నిరుద్యోగుల గరిష్ఠ వయో పరిమితిని పదేండ్లకు పెంచటం, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు కేటాయించటం గొప్ప విషయం. ఏడున్నరేండ్లలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో లక్షా 34 వేల ఉద్యోగాలు భర్తీ చేయగా.. మరోసారి భారీస్థాయిలో నోటిఫికేషన్ల జారీకి నిర్ణయం తీసుకోవటం చారిత్రాత్మకం.
– వీ శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్శాఖ మంత్రి
దేశంలోనే తొలిసారి భారీ ఉద్యోగ ప్రకటన
ఒకేసారి 80,039 పోస్టుల భర్తీ, 11,103 కాం ట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకొన్న దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణ. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజల భాగస్వామ్యం, అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు తన కలలను నెరవేర్చుకొంటున్నది. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగి అనే పదం లేకుండా చేశారు. 95% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని నిర్ణయించడం గొప్ప విషయం.
–సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ప్రకటన
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 80,039, 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పదేండ్ల వయో పరిమితి సడలింపు, జోనల్ వ్యవస్థ ద్వారా 95% ఉద్యోగాలు స్థానికులకు కేటాయింపు తదితర నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైంది. కేంద్ర సంస్థల్లో 8 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ఇటీవల కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. వాటిని వెంటనే భర్తీ చేసే వరకు బీజేపీ నేతలు ధర్నా చేయాలి. నిరుద్యోగులు కష్టపడి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. – ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్శాఖ మంత్రి
కేసీఆర్.. యువత, నిరుద్యోగ బంధు
రాష్ట్రంలో ఒకేసారి 91,142 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసిన కేసీఆర్.. యువత, నిరుద్యోగ బంధుగా నిలిచారు. ఇప్పటికే రైతులకు ఏటా రూ.10 వేలు పెట్టుబడి ఇస్తూ రైతుబంధుగా, మహిళలకు పెద్దఎత్తున నిధులు ఇస్తూ మహిళా బంధుగా ఉన్నారు. నిరుద్యోగ యువత తరపున సీఎంకు ధన్యవాదాలు.
– సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
2022 ఉద్యోగనామ సంవత్సరం
తెలంగాణలో 2022 ఉద్యోగనామ సంవత్సరం. కేసీఆర్ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల ఉద్యోగాలు మహిళలకు దక్కుతాయి. గిరిజనులకు స్థానికంగా ఉద్యోగాలు వచ్చేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలి.
– సత్యవతిరాథోడ్, గిరిజన సంక్షేమశాఖమంత్రి
నీళ్లు, నిధులు, నియామకాల నినాదం పరిపూర్ణం
సీఎం కేసీఆర్ నిర్ణయంతో నీళ్లు, నిధులు, నియామకాల నినాదం పరిపూర్ణమైంది. ప్రపంచమే అబ్బురపడే సాగునీటి ప్రాజెక్టులు కట్టి, మన నీళ్లు మనకు తెచ్చి.. మన నిధులు మనమే వాడుకొంటూ.. తాజాగా నియామకాల విషయంలో కూడా ఉద్యమ ట్యాగ్ లైన్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. జిల్లాలు, జోనల్, మల్టీ జోనల్ వారిగా ఉద్యోగాలు భర్తీ చేయనున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ.
– వేముల ప్రశాంత్రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి
23 వేల పైచిలుకు పోస్టులు బీసీలకే
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు చెప్పిన తీపికబురు బీసీలకు వరప్రదాయిని. కొత్తగా భర్తీ చేసే 80,039 ఉద్యోగాల్లో 23 వేలకుపైగా ఉద్యోగాలు బీసీ బిడ్డలకే దక్కనున్నాయి. బీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సంపాదించాలి. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ మంత్రి
ఉచిత కోచింగ్ సెంటర్లు పెడతా
ఉద్యోగాల నియామకాలపై సీఎం కేసీఆర్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొన్నారు. సీఎం నిర్ణయంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 1,769 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు జిల్లాలో ఉచితంగా సొంత నిధులతో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తా. విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పిస్తా. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.
– చామకూర మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి