హైదరాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ) : చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన 5% జీఎస్టీని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వికాస సమితి ప్రధానకార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేనేతపై విధించిన జీఎస్టీకి వ్యతిరేకంగా ఆదివారం తెలంగాణ వికాస సమితి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తపేటలోని పీవీటీ వస్త్ర సముదాయంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ హస్తకళలు, చేనేత వస్ర్తాలపై గతంలో ఎన్నడూ పన్ను విధించలేదని గుర్తుచేశారు.
కేంద్రం నిర్ణయంతో చేనేత వస్ర్తాల ధరలు పెరిగి, కొనుగోళ్లు తగ్గుతాయని, తద్వారా వ్యాపారులు, కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ సర్కార్ చేనేత కార్మికులను సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లోజుల విజయానంద్ మండిపడ్డారు. కార్యక్రమంలో సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిండిగం వెంకన్న, వేణుగోపాల్, లక్ష్మయ్య, దినకర్ రావు తదితరులు పాల్గొన్నారు.