Telangana Tourism | ప్రపంచ పర్యాటకుల భూతల స్వర్గంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. లండన్లో వరల్డ్ ట్రావెల్ మార్ట్ (WTM) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ ట్రావెల్ ఏజెంట్స్ (ABTA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియా టూరిజం సెక్రటరీ అరవింద్ సింగ్తో కలిసి తెలంగాణలో సీఎం కేసీఆర్ పర్యాటకం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న కృషిని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని, పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం పర్యాటక రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని గుర్తు చేశారు. పోచంపల్లి గ్రామం ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైందని, ఇందుకోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని స్పష్టం చేశారు. తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. వివిధ దేశాల పర్యాటకులు తెలంగాణను సందర్శించాలని కోరారు.
లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలపై సమగ్ర సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలోని రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్ షాహీ టోంబ్స్, ఆసియా ఖండంలో అతిపెద్ద బుద్ధిజం ప్రాజెక్ట్ బుద్ధవనం, యాదాద్రి టెంపుల్, మన్యంకొండ, వేయి స్తంభాల గుడి, సమ్మక్క సారాలమ్మ, కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్, కాళేశ్వరం ప్రాజెక్ట్, చారిత్రక వరంగల్ కోట వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాల ప్రదర్శనను డబ్ల్యూటీఎం వేదికగా ప్రదర్శిస్తున్నామని తెలిపారు. తెలంగాణ చరిత్ర, వారసత్వ సంపదతో పాటు బతుకమ్మను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా ఈ వరల్డ్ ట్రావెల్ మార్ట్ (WTM)లో ప్రచారం చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
ఈ సమావేశంలో భారతదేశానికే తలమానికమైన కోహినూర్ వజ్రం గురించి సైతం చర్చించినట్లు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ ట్రావెల్ ఏజెంట్స్ (ABTA) ప్రతినిధులను తెలంగాణను సందర్శించి రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధిని ప్రత్యక్షంగా వీక్షించాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పర్యాటకాభివృద్ధి శాఖ ఎండీ మనోహర్, పర్యాట శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేష్, అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ ట్రావెల్ ఏజెంట్స్ డైరెక్టర్ సుషాన్ ధీర్, ఆబ్టా హెడ్ ఆంజెలా హిల్స్ తదితరులు పాల్గొన్నారు.