ఏడున్నరేండ్ల కిందటిమాట.. ఉమ్మడి రాష్ట్రం.. ఏదైనా బడికిపోతే ఒక క్లాసులో 60 మంది బాలురు ఉంటే.. పదో పన్నెండు మందో బాలికలు ఉండేవారు. ఇప్పుడు దృశ్యం మారిపోయింది. వందమందిలో 52 మంది బాలికలే.. ఇంతలోనే ఎంతమార్పు! పలకా బలపం చేతబట్టిన నాటి నుంచే ప్రత్యేక శ్రద్ధ.. స్వేచ్ఛగా ఓనమాలు నేర్చేందుకో పాఠశాల.. చదువుల తరంగమై ముందుకు కదిలేందుకో గురుకులం.. జ్ఞాన సంపాదనకు ప్రత్యేక ప్రోత్సాహకాలు.. ఎక్కడా ఆగేది లేదు.. అడ్డుకట్టలు అసలే లేవు. ఇదీ తెలంగాణలో నేటి బాలికా విద్య ఒరవడి.
హైదరాబాద్, మార్చి 30 : మొదట్నుంచీ తెలంగాణ సమాజం.. బడుగు, బలహీన వర్గాల సమాజం. మట్టిపైనే ఆధారపడి సాగిన జనజీవనం. హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణ మంతా వెనుకబడిన ప్రాంతంగానే పరిగణించబడ్డ కాలం ఒకనాటిది. అలాంటి సమాజంలో చదువుకొనడం అపురూపమే. అదీ అమ్మాయి చదువుకోవడం ఆశ్చర్యమే. ఇవాళ తెలంగాణలో మహిళా సాధికారతను చూస్తే.. మహిళల్లో వచ్చిన చైతన్యాన్ని చూస్తే నిజంగానే అబ్బురమేస్తున్నది. ఇంటి పగ్గాలు ఇల్లాలి చేతికి వెళ్లిపోయాయి. బాల్యవివాహాలు మటుమాయమైపోయాయి. కడుపున పుట్టిన సంతానాన్ని బాగా చదివించి.. ప్రయోజకులను చేయాలన్న భావన తల్లిదండ్రుల్లో పెరిగింది. చదివించేందుకు ఆర్థిక స్థోమత అడ్డు రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు బాలికావిద్యను పరిపుష్టం చేశాయి. మెరికల్లాంటి అమ్మాయిలు ఇప్పడు యూనివర్సిటీ చదువుల దాకా సాగుతున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ పట్టుదలతో చదువుకొంటున్నారు. ఐఐటీలు.. ఐఐఎంలు, జాతీయ వర్సిటీలను మించి విదేశాల్లో సైతం చదువుకొంటున్నారు. ఇది తెచ్చుకొన్న తెలంగాణ సాధించిన ఫలం. తెలంగాణ అమ్మాయిల పాలిట వరం.
జీఈఆర్లో తెలంగాణ ఉత్తమం
18-23 ఏండ్ల వయస్కుల్లో గ్రాస్ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో జాతీయ సగటు కన్నా తెలంగాణ ఉత్తమంగా ఉన్నది. 2020 నివేదిక ప్రకారం జాతీయ సగటు 27.1గా ఉంటే, తెలంగాణ 35.6గా ఉన్నది. అమ్మాయిలు 36.4, అబ్బాయిలు 34.8గా ఉన్నారు. డిగ్రీ, పీజీలో చేరుతున్నవారిలో అబ్బాయిలకన్నా అమ్మాయిలు సగటున 1.6 శాతం అధికంగా ఉన్నారు. జాతీయ సగటు అమ్మాయిలు 27.3 శాతం కాగా, అబ్బాయిలు 26.9 శాతమే.
డ్రాపౌట్స్గా మారొద్దనే..
గురుకులాల విద్యార్థులు డ్రాపౌట్లుగా మారొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యావసతుల కల్పనకు పెద్దపీట వేసింది. కేజీ టు పీజీలో భాగంగా పెద్దఎత్తున విద్యాసంస్థలను నెలకొల్పుతున్నది. ఏడాదికి ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు వెచ్చించి, వారంతా ఉన్నత విద్యను అందింపుచ్చుకోవాలన్న ఆకాంక్షతో జూనియర్ కాలేజీలుగా, డిగ్రీ, పీజీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో మహిళల కోసమే డిగ్రీ, పీజీ వృత్తి విద్యా కాలేజీలను ప్రారంభిస్తున్నది. ఫలితంగా ఉన్నత విద్యలో మహిళల నమోదు గణనీయంగా పెరిగిపోయింది.
బాలికల విద్యకు ప్రాధాన్యం
తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు కొత్తగా 126 కస్తుర్బాగాంధీ బాలిక విద్యాలయాలను ప్రభుత్వం నెలకొల్పింది. మొత్తం 475 కేజీబీవీల్లో 1,10,634 మంది బాలికలు చదువుతున్నారు. 172 కేజీబీవీల్లో ఇంటర్ విద్య అందిస్తున్నారు. వీటిల్లో 16,371 మంది బాలికలున్నారు.
దేశానికే దిక్సూచి
గ్రామీణ పేద ప్రతిభ గల విద్యార్ధులకు ఉచిత నాణ్యమైన విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన గురుకులాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయి. మరే రాష్ట్రంలో లేనట్లుగా విజయపథాన సాగుతున్నాయి. ఇలాంటి గురుకులాలు తెలంగాణ సహా కొన్ని రాష్ర్ర్టాల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. అనతి కాలంలోనే మన గురుకులాలు విశిష్టమైన పాఠశాలలుగా నిలిచాయి. ఫలితాల సాధనలో అగ్రగామిగా నిలుస్తున్నాయి. వీటిల్లోని పేద విద్యార్ధులు దేశ విదేశాల్లో టెక్నోక్రాట్స్, బ్యూరోక్రాట్లుగా సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల విద్యావ్యవస్థపై అధ్యయనానికి పలు రాష్ర్టాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి.
100 కోట్లతో మహిళా యూనివర్సిటీ
ఉన్నత విద్యలో మహిళల ఎన్రోల్మెంట్ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇందుకోసం తాజా బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. కోఠి మహిళా కళాశాలను యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ వర్సిటీ అందుబాటులోకి రానున్నది. ఇందులో మహిళల కోసమే ప్రత్యేకంగా కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు సీట్లన్నీ అమ్మాయిలతోనే భర్తీ చేస్తారు.