హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): కీటక జనిత వ్యాధుల నియంత్రణలో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచింది. తక్కువ కేసులు, అతి తక్కువ మరణాలతో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 0.04 శాతం మంది మాత్రమే మరణించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఓ వైపు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలను చేపట్టి పారిశుద్ధ్యాన్ని పెంపొందించడంతో దోమలు, ఈగలు ఇతర కీటకాల సంఖ్య తగ్గింది. మరోవైపు వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేసి పీహెచ్సీ స్థాయి నుంచే మెరుగైన వైద్యం అందిస్తుండటంతో మరణాలు దాదాపు కనుమరుగయ్యాయి. 2008-2022 మధ్య దేశవ్యాప్తంగా నమోదైన కీటక జనిత వ్యాధులు, మరణాలపై ‘నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్’ గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది.
మరణాల నియంత్రణలో దేశానికే ఆదర్శం
2008-2022 మధ్య రాష్ర్టాలవారీగా నమోదైన కేసులు, మరణాల సంఖ్యను పరిశీలిస్తే.. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో కేవలం 0.04 శాతం మంది మాత్రమే మరణించినట్టు గణాంకాల్లో తేటతెల్లం అయ్యింది. వైద్యారోగ్య రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఇది సాధ్యమైంది. బస్తీ దవాఖానల ఏర్పాటు, పీహెచ్సీలు మొదలు అన్ని స్థాయిల దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పించడంతో ఆరోగ్య రంగం పటిష్టమైంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో స్పెషాలిటీ సేవలు చేరువయ్యాయి. దీనికితోడు టీ డయాగ్నస్టిక్స్ ద్వారా ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు చర్యల ఫలితంగా వ్యాధులను వెంటనే గుర్తించడం, దానికి అనుగుణంగా మెరుగైన చికిత్స అందించడం సాధ్యం అవుతున్నది. రాష్ర్టాలవారీ మరణాల్లోనూ మహారాష్ట్ర అగ్రభాగాన నిలిచింది. బీజేపీ పాలిత రాష్ర్టాలు గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో తెలంగాణతో పోల్చితే కనీసం నాలుగైదు రెట్లు అధిక మరణాలు నమోదు చేశాయి.
నామమాత్రంగా కేసులు నమోదు
గత 14 ఏండ్లలో దేశవ్యాప్తంగా నమోదైన కీటక జనిత వ్యాధుల సంఖ్యను పరిశీలిస్తే తెలంగాణలో కేసులు నామమాత్రంగా కనిపించాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో కేవలం 3.7 శాతం మాత్రమే తెలంగాణలో వెలుగుచూశాయి. తక్కువ కేసులు నమోదైన పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. బీజేపీ పాలిత రాష్ర్టాలు మహారాష్ట్ర (8శాతం), కర్ణాటక (7.7 శాతం), గుజరాత్ (7.7 శాతం), యూపీ (6.8 శాతం) తెలంగాణకన్నా దాదాపు రెట్టింపు కేసులు నమోదు చేశాయి.
మరణాల శాతం తెలంగాణలోనే తక్కువ
2008-2022 మధ్య దేశవ్యాప్తంగా నమోదైన కీటక జనిత వ్యాధుల మరణాల్లో తెలంగాణ అతి తక్కువ మరణాలతో ఆదర్శంగా నిలిచింది. హిమాచల్ప్రదేశ్ 0.5 శాతం మొదటి స్థానంలో నిలవగా, కేవలం 0.7 శాతం మరణాలతో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది. మహారాష్ట్రలో ఏకంగా 20.6 శాతం మరణాలు నమోదయ్యాయి. బీజేపీ పాలిత రాష్ర్టాలు గుజరాత్ 4.4 శాతం, కర్ణాటక 4.6 శాతం, మధ్య ప్రదేశ్ 3.3 శాతం, యూపీ 7.1 శాతం మరణాలను నమోదు చేశాయి.