హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): పరిశ్రమలు, భవన నిర్మాణాలకు అత్యంత వేగంగా అనుమతులివ్వడంలో యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నది. ఎలాంటి ప్రజాసమస్యనైనా కేవలం 15 రోజుల్లోనే పరిష్కరిస్తూ టాప్-3 రాష్ర్టాల్లో చోటు దక్కించుకున్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఇటీవల స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
దేశంలో ఎక్కడైనా ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను గరిష్ఠంగా 30 రోజుల్లోగా పరిష్కరించాలి. లేకపోతే అవి పెండింగ్లో ఉన్నట్టే. ఈ లెక్కన ప్రజల నుంచి స్వీకరించిన పిటిషన్ల పరిష్కారంలో అలసత్వం వహిస్తున్న రాష్ర్టాల జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రమైన త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ పిటిషన్ల పరిష్కారానికి అత్యధికంగా 180 రోజుల సమయం తీసుకొంటున్నారు. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ (159 రోజులు) నిలిచింది. అతి తక్కువ సమయం తీసుకొంటున్న రాష్ర్టాల జాబితాలో జమ్ముకశ్మీర్ (8 రోజులు) అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. మణిపూర్ (13 రోజులు), తెలంగాణ (15 రోజులు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
తెలంగాణలో నో పెండెన్సీ
ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ అండ్ మానిటరింగ్ సిస్టం (సీపీజీఆర్ఏఎంఎస్) పేరిట ఆన్లైన్ పోర్టల్ను నిర్వహిస్తున్నది. ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన సమస్యలపై సామాన్యులెవరైనా ఈ వేదిక ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. పరిష్కారం కోసం వాటిని కేంద్రం సంబంధిత రాష్ర్టాలకు పంపుతుంది. ఇందుకోసం రాష్ర్టాలవారీగా గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ఆఫీసర్ (జీఆర్వో)లు ఉంటారు. గత నెల 3న వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జీఆర్వోల సమావేశాన్ని నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార పురోగతిపై చర్చించారు. ఆ సమావేశంలో క్రోడీకరించిన వివరాలతో ఫిబ్రవరి నెలకు సంబంధించిన నివేదికను డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ శాఖ ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. గత నెల తెలంగాణ నుంచి వివిధ అంశాలకు సంబంధించిన 606 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 37 ఫిర్యాదులను పూర్తిగా, మరో 569 ఫిర్యాదులను పాక్షికంగా పరిష్కరించారు. దీంతో తెలంగాణ నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో కనీసం ఒక్కటి కూడా పెండింగ్లో లేదు. కానీ, ఇదే సమయంలో 22 ఇతర రాష్ర్టాల్లో వెయ్యికిపైగా ఫిర్యాదులు పెండింగ్లో ఉండటం గమనార్హం.
మరికొన్ని గణాంకాలు