Jeevandan | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): అవయవదానం, టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్లో అత్యుత్తమ సేవలు అందించడంలో తెలంగాణ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నది. అవయవదాన ప్రాధాన్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న అవగాహన ఫలిస్తున్నది. అవయవాలను ఇతరులకు దానం చేసి మరికొంత మంది ప్రాణాలను నిలుపుతున్న రాష్ర్టాల జాబితాలో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో మన రాష్ట్రం నిలిచింది. శనివారం తమిళనాడులో నిర్వహించిన అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ జీవన్దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత అవార్డును అందుకొన్నారు.
2012లో పురుడుపోసుకున్న జీవన్దాన్
డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం దేశంలో ఏటా 5 లక్షల మంది ప్రధాన అవయవాలు పనిచేయక మృతిచెందుతున్నారు. ఇలాంటి వారిని బతికించాలంటే అవసరమైన అవయవ మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2012లో రాష్ట్ర ప్రభుత్వం ‘జీవన్ధాన్’ పేరుతో ఒక సంస్థను స్థాపించింది. తొలి ఆరు నెలలపాటు అవయవదానం ప్రాముఖ్యత, ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించింది. 2013 జనవరి 13న మొట్టమొదటిసారిగా చెన్నైకి చెందిన 40 ఏండ్ల వ్యక్తి తన అవయవాలను దానం చేసినట్టు అధికారులు తెలిపారు.
అవయవ దానంలో తెలంగాణ భేష్
అవయవదానం చేయడంలో తెలంగాణ దేశంలోనే టాప్లో నిలిచింది. దీనిని గుర్తించిన కేంద్రం ప్రభుత్వం గతంలో ఢిల్లీలో జరిగిన అవయవదాన దినోత్సవంలో రాష్ర్టానికి ఉత్తమ అవార్డును అందచేసింది. జీవన్దాన్ రూపొందించిన సాఫ్ట్వేర్కు 2015లో స్కోచ్ అవార్డు లభించింది. తాజాగా దేశంలో రెండోస్థానంలో నిలిచింది.
9 నెలలు.. 160 డోనేషన్లు
తెలంగాణ ప్రభుత్వం, జీవన్దాన్ అవగాహనతో ప్రజల్లో మార్పు వస్తున్నది. గత 9 నెలల్లో రాష్ట్రంలో 160 ఆర్గాన్ డొనేషన్స్ జరిగాయి. ఈ సంవత్సరం చివరినాటికి ఆ సంఖ్య 200 దాటుతుంది. 2022లో 194 డొనేషన్స్ జరిగాయి. 2023 సెప్టెంబర్ నాటికి 160 డొనేషన్లు జరుగగా, దాదాపు 400కు పైగా ట్రాన్స్ప్లాంట్స్ జరిగాయి. అంటే రెండేండ్లలో దాదాపు 1,100 మంది ప్రాణాలను కాపాడగలగడం రాష్ర్టానికి గర్వకారణంగా చెప్పవచ్చు. -డాక్టర్ స్వర్ణలత, జీవన్దాన్ కోఆర్డినేటర్