హైదరాబాద్, జూన్21 (నమస్తే తెలంగాణ): నూతనంగా మరో 300 అమ్మ ఒడి, 34 పార్థివ దేహాల తరలింపు వాహనాలు, 204 అత్యవసర వైద్యసేవలను అందించే 108 వాహనాలను వచ్చేనెలలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. 108, 102 అమ్మ ఒడి, పార్థీవ వాహనాల పనితీరుపై ఉన్నతాధికారులతో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు.
కొత్తగా 300 అమ్మ ఒడి వాహనాలను జూలై మొదటి వారంలోగా కొనుగోలు చేసి సిద్ధం చేయాలని తెలిపారు. గర్భిణులకు అన్నిరకాల వసతులు కల్పించేలా అమ్మఒడి వాహనాలను రూపొందించాలని, వాటి పనితీరు, మరమ్మతులు, నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కాలం చెల్లిన వాహనాలను తొలగించి వాటిస్థానంలో నూతన వాహనాలను చేర్చాలని ఆదేశించారు. కాలం చెల్లిన 108 అంబులెన్స్ల స్థానంలో కొత్తగా కొనుగోలు చేస్తున్న 204 అంబులెన్స్లను జూలై చివరివారంలోగా అందుబాటులోకి తేవాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ దవాఖానాల నుంచి పార్థివ దేహాల తరలింపు కోసం అదనం గా 34 వాహనాల కొనుగోలు, బ్రాండింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి వాటిని జూలై చివరినాటికి వాడకంలోకి తీసుకురావాలని ఆదేశించారు.